హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్లో స్థిరపడేందుకు తెలుగు రాష్ర్టాల ప్రజలే కాకుండా దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. గత నెలలో రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ఇండ్ల అమ్మకాలు జరిగినట్టు రియల్ ఎస్టేట్ రంగ అధ్యయన సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ స్పష్టం చేసింది. ఏప్రిల్లో మొత్తం 5,331 ఇండ్ల అమ్మకాల ద్వారా రూ.2,767 కోట్ల లావాదేవీలు జరిగినట్టు వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో రూ.25 లక్షలలోపు విలువ గల ఇండ్ల అమ్మకాలు 53%, రూ.25-50 లక్షల పరిధిలో 17%, రూ.50-75 లక్షల పరిధిలో 13%, రూ.75 లక్షల నుంచి రూ.కోటి విలువైన ఇండ్ల అమ్మకాలు 8%, రూ.1-2 కోట్ల ఇండ్ల అమ్మకాలు 7%, రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఇండ్ల అమ్మకాలు 2% పెరిగినట్టు వివరించింది.
1000-2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన అపార్టుమెంట్ ఫ్లాట్ల అమ్మకాలు 72% పెరిగినట్టు పేర్కొన్నది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెలా సగటున 5-7 వేల ఇండ్లు అమ్ముడు పోయాయని, తద్వారా మొత్తం రూ.11,998 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు జరిగాయని పేర్కొన్నది. ఇది గత ఏడాది జరిగిన అమ్మకాల కంటే 10% అధికమని తెలిపింది. ఇదే సమయంలో నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు సైతం ప్రోత్సాహకరంగా ఉన్నాయని, జనవరి-ఏప్రిల్ మధ్య మొత్తం 24,797 రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో 4 జిల్లాలు (హైదరాబాద్తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి) కీలకంగా ఉన్నాయి. వీటిలో మేడ్చల్-మల్కాజిగిరి ముందు వరసలో ఉన్నది. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ఒడిదుడుకులున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం అన్నింటినీ తట్టుకొని ఆర్థికంగా బలోపేతమవుతున్నదని నైట్ ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బజాజ్ తెలిపారు.