హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం,గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్ల కేటాయింపునకు హెచ్ఎండీఏ శనివారం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న టవర్లలో ఫ్లాట్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయో.. అలాగే అప్పగించాలని నిర్ణయించింది. పోచారంలోని 4 టవర్లు 9 అంతస్థుల్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉన్నాయి. వీటి ధర చదరపు అడుగుకు రూ.1650 నిర్ణయించారు. గాజులరామారంలోని 5 టవర్లు 14 అంతస్థులు ఉండగా, ప్రతి టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. వీటి ధర చదరపు అడుగుకు రూ.1350 నుంచి రూ.1650 వరకు నిర్ధారించారు. ఆసక్తిగల వారు 2 % మొత్తాన్ని ఈఎండీ రూపంలో జనవరి 30 లోపు అందజేయాలని సూచించింది. మరిన్ని వివరాలకు పోచారం ఫ్లాట్లకు విజయపాల్రెడ్డి (9133366756), గాజులరామారాం ఫ్లాట్లకు నరేందర్రెడ్డి (98495 75225)ని సంప్రదించాలని తెలిపింది.