మహబూబ్నగర్ : మనిషికి నాగరికతను నేర్పిన జాతి సగర జాతి అని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సగర వంశస్తుడు భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని సగర కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సగర జాతి పట్టుదలకు మారుపేరన్నారు. ముఖ్యంగా భగీరథ మహర్షి తన తపస్సుతో దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చి పట్టుదలకు మారు పేరుగా నిలిచారన్నారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి తాగు నీరిచ్చే పథకానికి మిషన్ భగీరథ పేరు పెట్టామన్నారు. ప్రస్తుతం సగరుల కులవృత్తి అంతరించిపోయినప్పటికి నిర్మాణ రంగంలో స్థిరపడిపోయారని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరఫున సగరులకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సగర భవన నిర్మాణానికి స్థలంతో పాటు, నిధులు కూడా కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా సగర సంఘం అధ్యక్షుడు ప్రణీల్ చందర్ సగర, సమాచార శాఖ సహాయ సంచాలకుడు యు. వెంకటేశ్వర్లు సగర, మూసాపేట జెడ్పీటీసీ ఇంద్రయ్య సగర, మున్సిపల్ చైర్మన్ నర్సింలు, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వార్డు కౌన్సిలర్ వనజ, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర, సగర సంఘం నాయకులు, బుడ్డన్న సగర, ఆంజనేయులు సగర, ప్రేమ్ సాగర్, రవి సగర, హనుమంతు సగర, గడ్డమీది కృష్ణ, చిన్న కిష్టయ్య, శ్రీధర్,భీమన్న, పల్లె చందర్, నారాయణ, అలివేలు సగర, తదితరులు పాల్గొన్నారు.