హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రత కల్పించడం కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వ్యక్తి మంచిగా ప్రవర్తించడం ద్వారా మహిళలకు భద్రతా భావన కల్పించాల్సిన అవసరం ఉన్నదని సీఐడీ డీజీ చారుసిన్హా చెప్పారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న #StandWithHer ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని వీహబ్లో నిర్వహించిన నాలుగో విడత ప్యానల్ చర్చలో చారుసిన్హా మాట్లాడుతూ.. జీవితంలో తనకు అవకాశాలు కల్పించి, అవసరమైన సమయంలో అండగా నిలిచిన పురుషులకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినేనని తెలిపారు. మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా సంచరించగలిగే వాతావరణం ఏర్పడాలంటే సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని, మహిళలు సురక్షితంగా ఉన్నారనే నమ్మకాన్ని కలిగించే సామాజిక వాతావరణాన్ని నిర్మించడం అందరి బాధ్యతని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు.
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకోగలిగే వాతావరణాన్ని పురుషులు సృష్టించాలని, మహిళల మాటలను వినడం, అర్థం చేసుకోవడం, వారికి మద్దతుగా నిలవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మహిళలకు అండగా నిలిచే పురుషుడు బలహీనుడు కాదని, నిజానికి అతడే మరింత బలమైన వ్యక్తి అని ‘ది హిందూ బిజినెస్ లైన్’ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ రిచా మిశ్రా చెప్పారు. కుటుంబం, కార్యాలయం, సమాజం అనే తేడా లేకుండా మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించేందుకు పురుషులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ జర్నలిస్టు ఉమా సుధీర్ మాట్లాడుతూ.. మహిళలకు ఎదురవుతున్న వివక్ష, వేధింపులు, అన్యాయాలపై పురుషులు స్పందించాలని కోరారు.