నాగర్కర్నూల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/అమ్రాబాద్: సఫారీ టూర్.. అడవుల్లో జంతువులను చూస్తూ విహరించాలని ప్రతి ప్రకృతి ప్రేమికుడి కోరిక. ఇందుకోసం ఒకప్పుడు వేరే రాష్ర్టానికో, వేరే దేశానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల పరిరక్షణతో ఇక్కడే సఫారీ టూర్ ఎంజాయ్ చేసే అవకాశం కలిగింది. అటవీశాఖ అమ్రాబాద్ అడవుల్లో రూ.4,900కే సఫారీ టూర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో.. వెబ్సైట్, 8 కొత్త సఫారీ వాహనాలు, 6 కాటేజీలను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, ఉన్నతాధికారులతో కలిసి అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పులుల సందర్శనకు విదేశాలకు వెళ్లే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అద్భుతం ఇక్కడే ఆవిష్కృతమవుతున్నదని వివరించారు. నల్లమల అందాలను చూస్తుంటే విదేశీ అనుభూతి కలుగుతున్నదని తెలిపారు. నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతం కావడం, గడ్డి క్షేత్రాలు, శాఖాహార జంతువులు అధికంగా ఉండటంతో పులుల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు. 2018లో 18 పెద్ద పులులుంటే నేడు ఆ సంఖ్య 26కు చేరిందని, 106 ఊట చెరువులు, 1,149 సాసర్ పిట్లు, 99 చెక్ డ్యాంలు, 29 సోలార్ బోర్లతో జంతువులకు నీటిని అందుబాటులో ఉంచామని, 10 సీసీ కెమెరాలతో అడవులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
‘అడవులను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించాం. త్వరలో పోడు భూములపై నిర్ణయం తీసుకొంటాం. నల్లమల ప్రాంతం టూరిజం హబ్గా అభివృద్ధి చెందుతుంది. ఉమామహేశ్వరం, శ్రీశైలం, సలేశ్వరం, మద్దిమడుగు వంటి పుణ్యక్షేత్రాలు ఉండటంతో ఎకో టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఉమామహేశ్వరం నుంచి కొత్తగా సఫారీ టూర్ ప్రారంభిస్తాం’ అని వివరించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై వచ్చే ప్రచారం నమ్మొద్దని ప్రజలకు సూచించారు. చెంచులకు జూట్ బ్యాగుల తయారీ, తేనె సేకరణతో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విప్ గువ్వల మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దంటూ సీఎం కేసీఆర్ సహకారంతో తీర్మానం చేసి పార్లమెంట్కు పంపించామని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొన్న చర్యలతో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో అడవులు, పర్యాటకం అభివృద్ధి చెందాయని అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నదని ఎంపీ రాములు అన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు డోబ్రియల్, లోకేశ్ జైస్వాల్, చంద్రశేఖర్, కలెక్టర్ ఉదయ్కుమార్, ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ, డీఎఫ్ఐ రోహిత్, విశాల్, వై శ్రీనివాస్, సర్వేశ్వర్, ఎంపీపీ శ్రీనివాసులు, జడ్పీటీసీ రాంబాబు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహాగౌడ్, సర్పంచ్ శ్రీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.