తనకు రాజ్యసభ ఇప్పించాలని సాధ్వి ప్రాచీ వేడుకోలు
హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): రామచంద్రభారతి.. అలియాస్ ఆర్సీబీ.. ఇప్పుడు బీజేపీలో అగ్రనేత ద్వయానికి సన్నిహితుడు.. కేంద్రంలో.. బీజేపీలో పనులు కావాలన్నా.. పదవులు రావాలన్నా.. ఆర్సీబీ ఒక్క మాట చెప్తే పనైపోతుంది. దశాబ్దాల తరబడి పార్టీలో ఉండి.. పార్టీ ఎజెండాను మోసిన సీనియర్ నాయకులు సైతం.. అగ్రనేతల దర్శనం కావాలన్నా.. అనుగ్రహం సంపాదించాలన్నా తొలిమెట్టు ఆర్సీబీయే. తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు నిందితుల కాల్ డాటాను పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు, సాధ్వీ ప్రాచీ తనకు రాజ్యసభ టిక్కెట్ ఇప్పించాలంటూ ఆర్సీబీకి పంపిన సంక్షిప్త సందేశం దర్యాప్తు అధికారులకు ఆర్సీబీ కాల్ డాటాలో లభించిందని తెలిసింది. పలువురు నేతలు తమ పనులకోసం ఆర్సీబీ ద్వారా పైరవీ చేయించుకొంటున్నట్టు సమాచారం.