OU Campus | హైదరాబాద్ : రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని, పూర్వ వైభవం సాధిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Sabitha Indra Reddy ) చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో మౌళిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఆదేశాల మేరకు విద్యాసంస్థల్లో మౌళిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) ఇంజినీరింగ్ కళాశాలకు అనుబంధంగా నూతనంగా నిర్మించనున్న బాయ్స్ హాస్టల్( Boys Hostel )కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహముద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌళిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మెన్ రావుల శ్రీధర్రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలోనే పేరెన్నికగన్న యూనివర్సిటీ అని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఓయూ పూర్వ విద్యార్థులు ఉన్నారని గుర్తు చేశారు. యువతపై ఓయూ చెరగని ముద్ర వేసిందని చెప్పారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఓయూ గడ్డపై హాస్టల్ శంకుస్థాపన చేయడం గర్వకారణమన్నారు. కేసీఆర్ ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి తప్పకుండా కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే ఓయూలో బాయ్స్ హాస్టల్, నూతన పరిపాలనా భవనం, నిజాం కళాశాలలో హాస్టళ్లు, వివిధ యూనివర్సిటీలలో హాస్టళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఓయూలో రూ.39.50 కోట్ల నిధులతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అబ్బాయిలకు హాస్టల్ భవనం నిర్మిస్తున్నామన్నారు. 1.59 ఎకరాల్లో 85,508 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్థులతో నిర్మించే ఈ భవనంలో 133 గదులలో 532 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.