మణికొండ, మార్చి 26: అవకాశవాద నాయకులకు బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్ల ప్రజల శక్తిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్రెడ్డి, గడ్డం రంజిత్రెడ్డి తక్కువ అంచనా వేశారని పేర్కొన్నారు. ప్రజలు వీరిని నమ్మబోరని అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో మంగళవారం చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల శక్తిని తక్కువగా అంచనా వేసి విశ్వేశ్వ్రెడ్డి, రంజిత్రెడ్డి పార్టీ మారారని, ఇలాంటి అవకాశవాదులకు చేవెళ్ల గడ్డపై స్థానం లేదని తేల్చిచెప్పారు. అప్పట్లో రంజిత్రెడ్డి అంటే ఎవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదని, అలాంటి వ్యక్తికి కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి పంపిస్తే చేవెళ్ల ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ఇప్పుడా వ్యక్తికి చేవెళ్ల ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. రంగారెడ్డి మనవడినంటూ రాజకీయాల్లోకి వచ్చిన విశ్వేశ్వర్రెడ్డి క్షణంలోనే మనుషులను మరిచిపోతారని, అలాంటి వ్యక్తికి ప్రజల సమస్యలు ఏం గుర్తుంటాయని ఎద్దేవా చేశారు.
జిల్లా జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ ప్రజల్లో ఉంటూ సేవలందించారని, బడుగుల ఆశాజ్యోతిగా ఉన్న కాసానిని సమష్టిగా పనిచేసి గెలిపించి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని సబిత పిలుపునిచ్చారు. కేసీఆర్ నిషానా లేకుండా చేస్తానని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని, అది అసాధ్యమని పేర్కొన్నారు. కేసీఆర్ నిషానా లేకుండా చేయాలంటే తెలంగాణనే మార్చాలని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మిని కూడా లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్కు మించి అభివృద్ధి చేస్తారని నమ్మి గెలిపించిన ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజేంద్రనగర్లో ప్రకాశ్గౌడ్ను గెలిపించుకున్నట్టే కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కేసీఆర్ హయాంలో నార్సింగిలో ఇంటర్చేంజ్ ఏర్పాటు చేయడంతోపాటు అవుటర్ చుట్టూ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, వాణీదేవి, దయానంద్, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్య, మాజీ ఎంపీపీ మల్లేశ్, మున్సిపల్ చైర్మన్లు సుష్మారెడ్డి, రేఖయాదగిరి, నర్సింహ, చంద్రారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.