హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఓబుళాపురం మైనింగ్ లీజు అక్రమాలపై నమోదైన కేసులో సీబీఐ చెబుతున్న కొత్త డాక్యుమెంట్స్ అన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించిన పెట్టుబడుల వివరాలని, వాటితో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదని ఆమె తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు హైకోర్టుకు నివేదించారు. ఈ కేసులో 36 మంది సాక్షులున్నారని చెప్పే సీబీఐ అందులో ఏ ఒకరూ సబితకు వ్యతిరేకంగా చెప్పలేదని స్పష్టం చేశారు. ఓఎంసీ గనుల లీజుకు చెందిన రెండు జీవోలను కేంద్రం, హైకోర్టు తప్పుపట్టలేదని గుర్తు చేశారు. తన డిశ్చార్జి పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సబితాఇంద్రారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారించారు. మూడో అదనపు చార్జిషీట్లో సబితను అన్యాయంగా నిందితురాలిగా చేర్చారని ఉమామహేశ్వరరావు వాదించారు. సీబీఐ ప్రధాన చార్జిషీట్లోని అంశాలే అందులో ఉన్నాయని తెలిపారు. అధికారులు తయారు చేసిన ఫైళ్లపై సంతకాలు చేశానని, తనకు ఏమీ తెలియదని చెప్పి సబిత తప్పించుకోజాలరని సీబీఐ తరఫున ప్రత్యేక న్యాయవాది ఎం నాగేంద్రన్ వాదించారు.