హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎల్కేజీ బాలికపై లైంగిక వేధింపుల విషయమై బంజారాహిల్స్లోని బీఎస్డీ డీఏవీ స్కూల్ గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా డీఈవో రోహిణి ఉత్తర్వులు జారీచేశారు. బడుల్లో విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించేందుకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ ఘటనపై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉన్నత అధికారులతో సమీక్షించారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా 650 మంది విద్యార్థులను ఇతర బడుల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ విషయంలో తల్లిదండ్రుల సందేహాలను డీఈవో రోహిణి నివృత్తి చేస్తారని తెలిపారు.
కమిటీ స్వరూపం
బడుల్లో భద్రతపై అధ్యయనానికి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, స్త్రీశిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, మహిళల భద్రతను పర్యవేక్షించే డీఐజీ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. వారంలోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సూచించారు. నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.
బాసర విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు 18 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని తన కార్యాలయంలో పలువురు విద్యార్థులకు మంత్రి కండ్లద్దాలు అందజేశారు. వర్సిటీలో తక్షణమే అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటుచేయాలని, వైద్య సిబ్బందిని నియమించాలని వీసీని ఆదేశించారు. ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన సహకారంతో ఆర్జీయూకేటీలో 6,500 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు.