9వ విడత నిధుల పంపిణీకి కేసీఆర్ ఆదేశం
గతంలో మాదిరిగానే ఎకరాలవారీగా జమ
65 లక్షల మంది రైతులకు 7,500 కోట్లు
ఇప్పటివరకు 50,448 కోట్ల పంపిణీ
రైతుబంధును అడ్డుకోవడానికి కేంద్రం కుట్ర
బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా అడ్డు
కష్టాలు వెంటాడుతున్నా రైతుకు రాష్ట్రం అండ
మన్నును నమ్మిన రైతుకు ఇది కన్నుల పండుగ
తొలకరి చిందులేయంగనే.. తొలిచూరు వానలాగానే
తెలంగాణ నేలల్లో సిరుల సినుకులు కురుస్తున్నయి
కర్షకుల బతుకుల్లోకి వచ్చేసింది నిండు పున్నమి
ఆకుపచ్చని చందమామకు అందనున్న పెట్టుబడిసాయం
ఎవుసానికి ధైర్యమిచ్చి రైతు ముంగిట నిలిచిన సర్కారు
మచ్చలేని పాలనలో పచ్చ బొట్టుగా మారిన అన్నదాత
ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న కర్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తప్ప. రెండు కార్లకు ఎకరానికి పది వేల పెట్టుబడినిచ్చి.. రైతుల జీవితాలను, తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చివేసిన సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు సాయం యాభై వేల కోట్లను దాటింది. తెలంగాణ రైతుల్లో ఈ ఆనందం.. మాటలు తప్ప చేతలు చేతకాని కేంద్రం నేతలకు కండ్లల్లో నిప్పులు కురిపించింది. రైతుబంధును ఆపడానికి కుట్రలకు కేంద్రం తెరలేపింది. తెలంగాణ ప్రభుత్వానికి రుణ సమీకరణకు చిక్కులు మొదలయ్యాయి. అడ్డంకులన్నింటినీ అధిగమించి.. కుట్రలను ఛేదించి తొమ్మిదో సీజన్ రైతు బంధు పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు చెల్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఆదేశాలు జారీచేశారు. ఈ సీజన్లో రైతుబంధుకు అర్హులైనవారి సంఖ్య 65 లక్షల వరకు ఉండవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకోసం మొత్తం రూ.7,500 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,411.52 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
కేంద్రం కుట్రలు ఛేదించి..
రైతులకు పెట్టుబడి గోస తీర్చేందుకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నది. ఈ పథకాన్ని అడ్డుకోవడానికి కేంద్రం అనేక రకాలుగా కుట్రలు చేసిందన్న విమర్శలు వచ్చాయి. బ్యాంకుల నుంచి రాష్ర్టానికి రుణాలు ఇవ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుపుల్లలు వేసింది. కానీ.. రైతు ప్రయోజనాలే తన ప్రయోజనాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించి రైతులకు అండగా నిలిచారు. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా సరే.. రైతులకు పెట్టుబడి ఇబ్బంది రాకుండా యథావిధిగా రైతుబంధు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా పైసా కూడబెట్టి అవసరమైన నిధులను సమకూర్చింది. ‘నేను బతికున్నంత కాలం రైతుబంధు ఆగదు’ అని సీఎం కేసీఆర్ చెప్పిన మాట నిజమని రుజువైంది.
ఇప్పటివరకు రూ.50,448 కోట్లు
ఇప్పటివరకు రైతుబంధు ద్వారా రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేసింది. పథకం ప్రారంభమైన 2018-19 వానకాలం సీజన్ నుంచి గత యాసంగి వరకు ఏకంగా రూ.50,448 కోట్లు పంపిణీచేసింది. ఈ వానకాలం సీజన్తో కలిపితే ఇది రూ.58 వేల కోట్లకు చేరనున్నది. ఇంత భారీ మొత్తంలో నిధులను నేరుగా రైతులకు అందించిన ఘనత తెలంగాణదే. సీజన్ ప్రారంభానికి ముందే రైతుబంధు నిధులు కర్షకుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతుబంధు పంపిణీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలుపడంతో ఈ సీజన్లో ఎంత మంది రైతులు ఉంటారనేదానిపై సీసీఎల్ఏ నుంచి వ్యవసాయశాఖ వివరాలను సేకరిస్తున్నది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సీసీఎల్ఏ లబ్ధిదారుల జాబితా అందించాలని ఆదేశించారు. దీని ప్రకారం తొలుత ఒక ఎకరం మొదలుకొని క్రమంగా మిగతా వారికి రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నారు.
సీఎంకు ధన్యవాదాలు
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల కోసం రైతుబంధు నిధులు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిబంధనల పేరుతో ఎన్ని కొర్రీలు పెట్టినా రైతుబంధు పంపిణీ చేయాలని నిర్ణయించడం రైతులపై సీఎం కేసీఆర్కు గల ప్రేమకు నిదర్శనం.
–నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
కేంద్రం కక్ష… కేసీఆర్ ప్రేమ
తెలంగాణ రైతులపై కేంద్రం కక్షగడితే సీఎం కేసీఆర్ ప్రేమ చూపుతున్నారు. కేంద్రం చేస్తున్న కుట్రలను ఛేదించి.. రైతుబంధు పంపిణీ చేయడం రైతులపై సీఎం కేసీఆర్కు గల ప్రేమకు నిదర్శనం. ఆర్థిక కష్టాల్లోనూ రైతుబంధు ఇస్తున్న కేసీఆర్కు కృతజ్ఞతలు.
– పల్లా రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు