హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు రైతుబీమా కొండంత అండగా నిలుస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉంటున్నారని పేర్కొన్నారు. రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.
ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతుబీమా పథకానికి మంగళవారంతో ఐదేండ్లు పూర్తయ్యాయని తెలిపారు. పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు.
2018లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, ప్రస్తుతం రూ.1,477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు రైతుల తరుఫున ప్రభుత్వం రూ.6,861 కోట్లు ప్రీమియం చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ.5,402 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు వెల్లడించారు. గుంట భూమి ఉన్నా రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందించే అద్భుత రైతుబీమా పథకం ప్రపంచంలో మరెకడా లేదని తెలిపారు. రైతుల గురించే కాదు, రైతు కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.