నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు సాయంపై రైతన్నలు ఊరూరా సంబురాలు జరుపుకొంటున్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. పొలాల్లో, రైతువేదికల్లో పంట ఉత్పత్తులతో ‘రైతుబంధు’ అని రాసి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. బుధవారం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు రంగులు చల్లుకొన్నారు. తోటల్లో పూసిన పూలతో సీఎం చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులతో రైతులు సంబురాలు చేసుకొన్నారు. మిర్చి, పత్తి, పల్లి, ఆపరాల యార్డుల్లో పంట ఉత్పత్తులతో సీఎం చిత్రపటానికి అభిషేకం చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. మహిళలు ఇండ్ల ముందు ముగ్గులు వేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆకట్టుకొన్న రంగోళి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేటలో బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. కేసీఆర్ చిత్ర ఆకృతిలో వేసిన ముగ్గులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశంసించారు. ‘రైతుబంధు’ పథకంతో రైతులంతా సంబురంగా సాగు చేసుకుంటున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు.
సంబురాల్లో కాంగ్రెస్ సర్పంచ్
జనగామ మండలం సిద్దెంకిలో కాంగ్రెస్ సర్పంచ్ సుంకరి నిర్మల రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. పంట పొలాల్లో మహిళా రైతులతో కలిసి ‘జై కేసీఆర్, జై రైతుబంధు’ అక్షరాలతో నారు పేర్చి సీఎం కేసీఆర్పై తమకున్న అభిమానం చాటుకొన్నారు.