హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): పోడు రైతులకు వచ్చే వానకాలం సీజన్ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనునున్నాయి. అటవీహ క్కు పత్రాలు లేనికారణంగా గిరిజన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్.. వారికి అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో పోడు రైతులకు అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
గిరిజన రైతులు హక్కుపత్రాలు స్వీకరించేనాటికి ముందే రైతులందరికీ బ్యాంకు ఖాతాలు తెరవాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసీ, గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూమికి హక్కు పత్రాలు స్వీకరించే 1,50,224 మంది రైతులకు బ్యాంకు ఖాతాలను వచ్చేనెల 10లోగా తెరిపించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.
పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించి సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, లబ్ధిదారుడి మొబైల్ నంబర్ తదితర వివరాలను అప్లోడ్ చే సేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచేపనిలో నిమగ్నమయ్యారు.