Minister Jagadish Reddy | భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటే మనం.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గమే తన కుటుంబంగా భావించి తన కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలన్న లక్ష్యంతో సూర్యాపేట మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం ‘రుతు ప్రేమ’ పేరిట నూతన కార్యక్రమానికి మంత్రి జగదీశ్రెడ్డి శ్రీకారం చుట్టారు. సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో రుతు ప్రేమపై మహిళలకు జరిపిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. బెంగుళూరుకు చెందిన పర్యావరణ సంరక్షకురాలు డాక్టర్ శాంతి మాట్లాడుతూ శానిటరీ ప్యాడ్స్ వాడడంతో జరిగే అనర్థాలను వివరించారు.
ప్రతి నెలా జరిగే రుతుస్రావ ప్రక్రియలో బట్ట ప్యాడ్లు, రుతుస్రావ కప్పులు వాడడంతో ఆరోగ్య సమస్యలు రావని, ఇది మన ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పాటవుతుందన్నారు. తెలంగాణలో జీవించే ప్రతి ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆడపడుచులంతా ఆరోగ్యంగా ఉండాలనేదే మా తపన అన్న మంత్రి, అందుకోసమే ఈ రుతు ప్రేమ కార్యక్రమం చేపట్టామన్నారు. రసాయనిక శానిటరీ వాడడంతో సైడ్ ఎఫెక్ట్స్, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పుకొచ్చారు.
శానిటరీ కప్స్ వాడడంతో ఆరోగ్యంతో పాటు డబ్బు ఆదా చేయవచ్చని తెలిపారు. మరో మార్పునకు తొలిమెట్టు మనమే కావాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. మహిళలకు సంబంధించి రుతుస్రావం అంశంపై బహిరంగంగా చర్చించడం విజయానికి తొలిమెట్టుగా భావించాలని, పునర్వినియోగమయ్యే వస్త్ర ప్యాడ్లు, కప్స్, డైపర్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత సూర్యాపేటలో మొదలైన రుతుప్రేమ ఇక్కడితో ఆగొద్దని ఆశించారు. అనంతరం ర్యాష్ ఫ్రీ, క్యాష్ ఫ్రీ, ఫీల్ ఫ్రీ నినాదంతో మహిళలకు, బాలికలకు రుతుస్రావ శానిటరీ కప్స్, బట్ట డైపర్లు, ప్యాడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.