ధర్మపురి, జూలై 9 : ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే, స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రూ.62 లక్షలతో సెంట్రల్ లైటింగ్, బస్ షెల్టర్, యాదవ సంఘ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోపులాపూర్లో రూ.70 లక్షలతో పద్మశాలీ సంఘ భవనం, మాల సంఘ భవన నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ అందజేశారు. యశ్వంతరావ్పేటలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు, రూ.5 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. రూ.10 లక్షలతో మాదిగ, కురుమ సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం కులస్థులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు గ్రామాలకు వెళ్లాలంటే ముండ్ల పొదలు, చెట్ల కుప్పలు, మురుగునీటిని దాటుకొని పోయేవాళ్లమని, మురుగునీరంతా ఇండ్ల ముందు పారుతుండేదని గుర్తుచేశారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదన్నారు.