హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండిన తర్వాత వృథాగా దిగువకు పోకుండా మళ్లించుకొనే మిగులు జలాలను లెక్కించవద్దని ఏపీ చేసిన వాదనలను తెలంగాణ ప్రభుత్వం నిర్దంద్వంగా తోసిపుచ్చింది. కృష్ణా నది నుంచి మళ్లించుకొనే ప్రతి నీటి చుక్కనూ లెక్కించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ ట్రిబ్యునల్ అవార్డుకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా రూపొందించే రూల్ కర్వ్స్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కరాఖండిగా చెప్పింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్, రూల్ కర్వ్స్, మిగుల జలాల వినియోగం అంశాలను తేల్చేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేకంగా రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పర్యాయాలు భేటీ అయిన ఈ కమిటీ శుక్రవారం మూడో విడత సమావేశమైంది. కమిటీ కన్వీనర్ రవికుమార్ పిైళ్లె ఆధ్వర్యంలో జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా మిగుల జలాల వినియోగంపై చర్చించారు.
ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాత మళ్లించుకునే నీటిని లెక్కించవద్దని ఏపీ చేసిన వాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. నీటిని మళ్లించుకొనే, నిల్వ చేసుకొనే సామర్థ్యం ఏపీకి చాలా ఎక్కువగా ఉన్నదని వివరించింది. ఈ నేపథ్యంలో స్పిల్ ఓవర్ సమయంలో మళ్లించిన నీటిని కూడా ఏపీ వాటా కింద లెకించాలని, లేకుంటే మళ్లీ ఉమ్మడి స్టోరేజీల నుంచి నీటిని కోరుతూ అధిక మొత్తంలో కృష్ణా జలాలను వినియోగించుకొనే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి కేవలం 34 టీఎంసీలను వినియోగించుకునేందుకే ఏపీకి అనుమతివ్వాలని, మిగులు జలాలను పరస్పర అంగీకారంతో మాత్రమే ఉపయోగించుకొంటామని తెలిపింది.
అది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం..
శ్రీశైలం పంప్డ్ స్టోరేజీ సేవలను ఉపయోగించుకొనేందుకు తమకు కూడా అవకాశమివ్వాలని ఏపీ కోరగా.. అది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశమని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. అన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని, ఆ తర్వాత అవసరమైన చోట తెలంగాణ అభిప్రాయాలను రాస్తామని తెలిపారు. అనంతరం కన్వీనర్ రవికుమార్ పిైళ్లె మాట్లాడుతూ.. ఈ సమావేశంలో ప్రొసీడింగ్లు జరిగినట్టుగానే నమోదు చేస్తామని తెలిపారు. ట్రిబ్యునల్ అవార్డు మేరకే రూల్ కర్వ్స్ను రూపొందిస్తామని వెల్లడించారు. అక్టోబర్ వరకు శ్రీశైలంలో 854+ అడుగుల స్థాయిని కొనసాగించడం, ఆ తర్వాత 830+ అడుగులకు తగ్గించడంపై ఉన్న అభ్యంతరాలపై తదుపరి సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జలమండలి చీఫ్ ఇంజినీర్ మోహన్ కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ విజయ్కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.