హుస్నాబాద్, మే 11 : హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోళ్లతో సందడిగా మారింది. మార్కెట్లోని కొనుగోలు కేంద్రంతో పాటు పట్టణంలో మరో రెండు కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ అన్ని సౌకర్యాలు ఉన్న మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికే ఎక్కువ మంది రైతులు తాము పండించిన ధాన్యాన్ని తెస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా వడ్ల రాసులే కనిపిస్తున్నాయి. ధాన్యం ఆరబెట్టుకునేందుకు సరిపోయేంత స్థలం ఉండటం, వర్షం వస్తే షెడ్లు, గోదాంలలో నిల్వ ఉంచుకునే అవకాశం, అందుబాటులో టార్పాలిన్లు, తాగునీరుతో పాటు ఇతర సౌకర్యాలు మార్కెట్ యార్డులో ఉండటం వల్ల రైతులు ధాన్యాన్ని ఇక్కడికే తెచ్చి అమ్ముకుంటున్నారు. దీంతో నిత్యం మార్కెట్యార్డు రైతులు, హమాలీలు, చాట కార్మికులు, డ్రైవర్లతో కిటకిటలాడుతోంది.
ధాన్యం ఆరబోసుకుంటున్న రైతులు, వడ్లను తూకం వేస్తూ ట్రాక్టర్లలో బస్తాలు లోడు చేస్తున్న హమాలీలు, వడ్లను సంచుల్లో నింపుతున్న చాట కార్మికులు, ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు ఇలా ఎవరి పనుల్లో వాళ్లు బిజీబిజీగా ఉంటున్నారు. గడిచిన పది రోజుల్లో కేవలం మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో 157మంది రైతులకు చెందిన 9,363 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో సగానికి పైగా రైతులకు ఇప్పటికే బ్యాంకుల్లో డబ్బులు జమయ్యాయి. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా వడ్లు అమ్మాక వెనువెంటనే డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమకావడం పై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.