TSRTC | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): పాత కథే పునరావృతమవుతున్నది. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీతో ఆమోదించిన బిల్లులకు రాజ్భవన్ రాజముద్ర వేయటంలో సాచివేత ధోరణిని అవలంబిస్తున్నది. ఈ నెల 11వ తేదీన పంపిన బిల్లులను గవర్నర్ ఇంతకాలం తొక్కిపెట్టి వాటిని గురువారం మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపింది. వీటిలో అత్యంత కీలకమైన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇక తాము ప్రభుత్వంలో విలీనమైనట్టేనని సంబరపడుతున్న 43 వేలమంది ఆర్టీసీ కార్మికులు హతాశులయ్యారు. కాలయాపన కోసమే ఆర్టీసీ బిల్లును రాజ్భవన్ మళ్లీ న్యాయశాఖకు పంపిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన బిల్లును గవర్నర్కు పంపగా, అసెంబ్లీ సమావేశాల చివరిరోజు వరకూ అనుమతి ఇవ్వకుండా నాన్చారు. దీంతో కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. ఆ పరిణామాల మధ్య బిల్లుకు రాజ్భవన్ ఆమోదం లభించటం, ఆ వెంటనే ప్రభుత్వం బిల్లును శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయటం జరిగిపోయాయి. తిరిగి ఆ బిల్లుపై సంతకం కోసం ఈ నెల 11న గవర్నర్కు పంపారు. దీనితోపాటు గతంలో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను కూడా అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపారు. తాజాగా ఆ బిల్లులన్నింటినీ గవర్నర్ న్యాయశాఖ పరిశీలనకు పంపారు. రాజ్భవన్ తీరుపై ఆర్టీసీ కార్మిక నేతలు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. గవర్నర్ తీరు ఆర్టీసీ కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నదని మండిపడ్డారు. దీంతో రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ కార్మికుల భద్రత, సంక్షేమం కోసమే న్యాయశాఖ వివరణ కోరినట్టు తెలిపింది.
గవర్నర్ తీరుతో కార్మికుల్లో అసహనం: థామస్రెడ్డి
ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుపై సంతకం చేయడంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఆర్టీసీ కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నదని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి థామస్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనం పొందుతామని భావిస్తున్న తరుణంలో న్యాయసలహా పేరుతో బిల్లు ఆమోదాన్ని మరింత ఆలస్యం చేయడం తగదని సూచించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. గవర్నర్ తీరుతో ఆర్టీసీ కార్మికులు ఆయోమయానికి గురవుతున్నారని అన్నారు. కార్మికుల నోటికి అందే ముద్దను నేలపాలు చేసేలా వ్యవహరించడం మంచిదికాదని హితవు పలికారు. బిల్లు ఆమోదంలో జాప్యం జరిగితే కార్మికుల్లో అసహనం పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. గవర్నర్ బిల్లును ఆమోదించడంలో ఆలస్యం చేస్తే మరోమారు రాజ్భవన్ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. కార్మికుల న్యాయపరమైన కోరికలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే గవర్నర్ బిల్లును ఆమోదించాలని థామస్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ తీరు అప్రజాస్వామికం: కూనంనేని సాంబశివరావు
ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు అంగీకారం తెలిపేందుకు జరుగుతున్న జాప్యం సుమారు 43 వేల మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తున్నదని అన్నారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకాలు చేయడంతో చట్టరూపం దాల్చాయని, అంతకంటే ముందే శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు.
ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేముందే మూడు రోజుల పాటు ఆపారని, ప్రభుత్వ వివరణ తరువాత సభలో ప్రవేశపెటేందుకు సమ్మతించారని, ఉభయ సభల్లో ఆమోదించిన అదే బిల్లుకు పది రోజులు దాటినా ఎందుకు ఆమోదముద్ర వేయడం ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలకు ముందే గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల కోసం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసి పంపిన ఫైలును కూడా ఇప్పటి వరకు గవర్నర్ తొక్కిపెట్టారని గుర్తుచేశారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్, కేంద్రం కనుసన్నల్లో మెలుగుతూ కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు ఆటంకాలు కల్పిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తంచేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు. తక్షణమే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయాలని డిమాండ్ చేశారు.