నల్లగొండ: టీఎస్ ఆర్టీసీని (RTC) లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి నల్లగొండకు ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నల్లగొండ డిపో, బస్టాండ్ను పరిశీలించారు. బస్టాండ్లో సౌకర్యాలపై ప్రయాణికులతో ముచ్చటించి, అనంతరం
అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివాహలు, విహార యాత్రలకు, రైతుల ధాన్యం తరలింపునకు ఆర్టీసీ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.
బస్సు సౌకర్యం కోసం తనకు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే పంపిస్తామని చెప్పారు. అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నామని వెల్లడించారు. కార్గో సేవలు బాగున్నాయని, దానిద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. బస్టాండ్లలో ఎమ్మార్పీ ధరలకే వస్తువులను అమ్మాలని, ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరారు. త్వరలోనే ఆర్టీసీని లాభాల బాటపట్టిస్తామన్నారు. అనంతరం ఆయన మిర్యాల గూడకు బస్ డిపోకు వెళ్లనున్నారు.