హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్పాస్లు 40 శాతం తగ్గాయని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో హైదరాబాద్ జంటనగరాల్లో ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తు తం ఆ సంఖ్య 21 లక్షలకు చేరిందని, నగరం లో 3 నెలలుగా బస్పాస్ల తగ్గుదల కనిపించిందని గుర్తించారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం (మహాలక్ష్మి పథకం) అందుబాటులోకి వచ్చింది. అందులోభాగంగా నగరంలో తిరిగే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో పాస్లు మాత్రం భారీగా తగ్గాయి.
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం విద్యార్థుల బస్పాస్లు లక్షా 60 వేలు, జనరల్ పాస్లు 90 వేలు, దివ్యాంగుల పాస్లు 30వేలు, ఎన్జీవో పాస్లు 2 వేల వరకు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో నగరంలో ఉండే అన్ని రకాల బస్పాస్లపై ప్రభావం పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో 7లక్షలకు పైగా బస్పాస్లు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సంఖ్య 4.50 లక్షలకు చేరింది. కరోనా తర్వాత బస్పాస్లు 3.9 లక్షల వరకు తగ్గిపోయాయి. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత అవి 2.82 లక్షలకు చేరినట్టు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో ప్రస్తుతం 2,850 బస్సులు తిరుగుతున్నాయి. కానీ 7,500 వరకు అవసరమని నివేదికలు చెబుతున్నాయి. బస్సులు పెరిగితే మళ్లీ ప్రయాణికులతో పాటు పాస్లు సైతం పెరుగుతాయని నిపుణులు పేరొంటున్నారు.