హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ‘ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అన్న ట్యాగ్లైన్తో టీఎస్ఆర్టీసీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించతలపెట్టింది. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 3 వరకు 101 డిపోల పరిధిలో శిబిరాలు నిర్వహించనున్నది. ఎంజీబీఎస్లో శిబిరాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి ప్రారంభిస్తారు. గత కొన్నేళ్లుగా రక్తదాన కార్యక్రమాలను చేపడుతున్న సంస్థ నిరుడు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్నది. రక్తదానంపై అపోహలు వద్దని,18 నుంచి 60 ఏండ్ల మధ్య వయసున్న వారు రక్తదానం చేయొచ్చని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కోరారు. ప్రతి డిపో పరిధిలో ప్రతి విద్యాసంస్థ నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలతోపాటు రెడ్క్రాస్ సొసైటీ శిబిరాల నిర్వహణకు సహకరించనున్నాయని తెలిపారు.
ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ చార్జీలు తగ్గింపు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను ఆర్టీసీ సవరించింది. ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎక్స్ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలోమీటర్లలోపు రూ. 20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్కు రూ.30 వసూలు చేయనున్నది. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్కు మంచి స్పందన ఉన్నదని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రోజూ సగటున 15 వేల టికెట్ల వరకు ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారని, వారికి ఆర్థికభారం తగ్గించేందుకే రిజర్వేషన్ చార్జీలను తగ్గించినట్టు పేర్కొన్నారు.