హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి గడపకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ‘విలేజ్ బస్ ఆఫీసర్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజారవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించామని వెల్లడించారు. హైదరాబాద్లోని బస్భవన్లో విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విలేజ్ బస్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. విలేజ్ బస్ ఆఫీసర్లే ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లు అని, ప్రజలకు సంస్థకు మధ్య అనుసంధానకర్తల్లాగా వ్యవహరిస్తారని సజ్జనార్ తెలిపారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం తదితర అంశాలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేలా డిపో యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఆక్యుపెన్సీ రేషియా(ఓఆర్) పెంచేలా పాటుపడాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరించిన విలేజ్ బస్ ఆఫీసర్లను గుర్తించి సతరిస్తామని ప్రకటించారు. అనంతరం విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ పోస్టర్, కరదీపికను ఆవిషరించారు. విలేజ్ బస్ ఆఫీసర్కు ఐడీ కార్డుతోపాటు బ్యాగ్ను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) డాక్టర్ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవనప్రసాద్, చీఫ్ మేనేజర్(ప్రాజెక్ట్స్ అండ్ ఎస్టేట్స్) విజయ్కుమార్, సీఈఐటీ రాజశేఖర్, బిజినెస్ హెడ్ సంతోష్కుమార్, సీటీఎం(మారెటింగ్) సుధాపరిమళ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్ఎంలు వెంకన్న, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.