నల్లగొండ సిటీ, నవంబర్ 6: ‘సమయానికి బస్సులు వస్తున్నాయా..?, ఆపమన్న చోట డ్రైవర్లు బస్సు ఆపుతున్నారా..?’ అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులను ఆరా తీశారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. నల్లగొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలను శనివారం ఆయన సందర్శించారు. హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చిన సజ్జనార్.. బస్టాండ్లో బస్సులను పరిశీలించారు. దుకాణాలను తనిఖీ చేసి ధరలపై ఆరా తీశారు. ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్గో సేవలను పరిశీలించారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఇటీవల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పారు. పుణ్యక్షేత్రాలకు, పెండ్లిళ్లకు డిపాజిట్ లేకుండా తక్కువ ధరకే బస్సులు నడుపనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కార్గోలో తరలించుకోవాలని కోరారు. ప్రయాణికుల భద్రత కోసం బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ఎండీకి ట్వీట్.. మర్చిపోయిన చిల్లర వాపస్
జీడిమెట్ల: బస్సు ఎక్కి చిల్లర తీసుకోవడం మరిచిపోయిన ఓ ప్రయాణికుడు విషయాన్ని ఆర్టీసీ ఎండీకి ట్విట్టర్లో తెలియజేయడంతో అతని నగదు బ్యాంకు ఖాతాలో జమ చేసిన ఘటన జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో జరిగింది. సీతాఫల్ మండికి చెందిన లిక్కి రాజు సికింద్రాబాద్కు వెళ్లేందుకు గురువారం బాలానగర్లో జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కారు. రూ.100 చెల్లించి టికెట్ తీసుకున్నారు. కండక్టర్ వద్ద చిల్లర లేకపొవడంతో టికెట్ వెనుక రూ.80 రాశారు. సికింద్రాబాద్కు చేరుకోగానే రూ.80 తీసుకోవడం మరిచిపోయారు. కొంత సమయం తర్వాత సికింద్రాబాద్కు వచ్చినా బస్సు ఆచూకీ దొరకలేదు. దీంతో విషయాన్ని ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశారు. స్పందించిన సజ్జనార్ వివరాలు పంపించాలని కోరా రు. ప్రయాణికుడి బ్యాంక్ ఖాతా వివరాలను జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్రెడ్డికి పంపించారు. అనతరం ప్రయాణికుడికి చెల్లించాల్సిన రూ.80 బ్యాంక్ ఖాతాకు గూగుల్పే ద్వారా పంపించారు. డబ్బులు తిరిగి రావడం పట్ల సజ్జనార్కు లిక్కిరాజు కృతజ్ఞతలు తెలిపారు.