TGSRTC | ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేస్తోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న ఆరోపించారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా జారీ చేసిన జీరో టికెట్లకు సంబంధించి ప్రతి నెల రూ.350 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తామని హామీ ఇచ్చి, ప్రతి నెల అరకొర నిధులను విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీలో రెండేండ్లుగా మహాలక్ష్మీ పథకం విజయవంతంగా అమలు జరుగుతోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. దీనికి సంబంధించి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 8,700 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 6,620 కోట్లే విడుదల చేసి మొత్తం చెల్లించినట్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. కానీ ఆర్టీసీకి చెల్లించాల్సిన సొమ్ము సుమారు 2,072 కోట్లు ఇవ్వకుండా, ఆ భారాన్ని ఆర్టీసీ మీదనే ప్రభుత్వం రుద్ది చేతులు దులుపుకోవడం సమంజసం కాదని అన్నారు. అలాగే ఆర్టీసి ఉద్యోగులకు చెల్లించాల్సిన 2017 వేతన సవరణ బకాయిలు.. 2021, 2025 వేతన సవరణలు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. ఆర్టీసీకి బకాయి పడ్డ డబ్బులను వెంటనే విడుదల చేసి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరారు.
మహాలక్ష్మి పథకం అమలు సజావుగా అవుతున్నదని సంబరాలు చేసుకుంటున్న ప్రభుత్వం.. పథకానికి అవసరమయ్యే బస్సులను సమకూర్చడంలో, సిబ్బందిని నియమించడంలో, ఈ పథకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివారించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీలో పొదుపు చేసుకున్న మొత్తాలకు చెల్లించాల్సిన వడ్డీ 15 నెలలుగా చెల్లించకపోవడం వలన కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీపై సవతి ప్రేమను విడనాడి తక్షణమే 2,072 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు.