హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5% డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ వేతనంతో కలిపి డీఏను చెల్లించనున్నది. పెండింగ్లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసిందని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారని, పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.