హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం పేరు మార్పుపై ఆర్ఎస్ఎస్ మరోసారి వివాదాన్ని రాజేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడు రోజుల సమన్వయ్ బైఠక్ సమావేశాలను ఏర్పాటు చేసింది. కార్యక్రమం షెడ్యూల్ను ప్రకటిస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపుతున్నది. ‘సామాజిక జీవితంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) 2022 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్లో జరగనుంది’ అంటూ ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది.
ఇందులో హైదరాబాద్కు బదులుగా భాగ్యనగర్ అని పేర్కొనడంపై దుమారం రేపుతున్నది. గత అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫైజాబాద్ను అయోధ్యగా, అలహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చినట్లుగా హైదరాబాద్ పేరును కూడా భాగ్యనగర్గా మారుస్తామన్నారు. ఆ సమయంలో ఈ విషయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
మరోసారి భాగ్యనగర్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ట్వీట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. సమన్వయ్ బైఠక్ సమావేశాలకు సంఘ్ అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా పాల్గొనున్నట్లు సమాచారం. బీజేపీతో సహా దాని అనుబంధ సంస్థల పనితీరు, వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను సంఘ్ సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.