హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కొందరు కాంగ్రెస్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. మీరు పోలీసులా.. కాంగ్రెస్ ఏజెంట్లా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు, హత్య లు జరుగుతున్నా కేసులు నమోదు చేయకుండా, బాధితులపైనే ఉల్టా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు పా రితే.. ఇప్పుడు కాంగ్రెస్ రక్తపుటేరులు పారిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న హత్యలకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నాగర్కర్నూలును కల్లోలిత జిల్లాగా, శాంతిభద్రతలపరంగా సమస్యాత్మక జిల్లాగా ప్రకటించాలని సూచించారు. శనివారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, మెతుకు ఆనంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పదిరోజుల ముందే డీజీపీకి జిల్లా లో ఉన్న పరిస్థితులపై వివరించామని, అయినా శ్రీధర్రెడ్డి హత్య జరిగిందని చెప్పారు. హత్య కేసులో ఇప్పటివరకు ఒకరిని కూడా అదుపులోకి తీసుకోలేదని, రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్టు అని ఆరోపించారు.
ఒక్కరినీ అరెస్టు చేయలేదెందుకు?
మంత్రి జూపల్లి మనుషులే తమ కుమారుడి హత్యకు కారణమని శ్రీధర్రెడ్డి తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పారని, అయినా పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలా వ్యవహరిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. నిందితులను ఎకడ దాచారో జూపల్లికి తెలుసునని, ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. అనేక గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై జూపల్లి మనుషులు దాడి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కేసులో రాజీపడాలని బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, పోలీసు వ్యవస్థను ఇలాగేనా నడిపేదీ అంటూ సీఎంను ప్రశ్నించారు. పోలీసులు కాంప్రమైజ్ ఏజెన్సీనా లేక కానిస్టిట్యూషన్ ఏజెన్సీనా అంటూ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. పోలీసులు జూపల్లి చెప్పినట్టుగా చేస్తున్నారని ఆరోపించారు. జూపల్లి కొల్లాపూర్కు యూపీ తరహా బుల్డోజర్ల సంస్కృతిని తెచ్చారని, తనకు గిట్టని వారి ఇండ్లపై బుల్డోజర్లను ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగిన కొత్తలోనే మల్లేశ్ అనే మాజీ జవాన్ను హత్య చేయించారని ఆరోపించారు. శ్రీధర్రెడ్డి హత్య కేసులో సిట్తో దర్యాప్తు జరిపి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని, స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సీబీఐ చేత విచారణ జరిపించాలి: బీరం
కొల్లాపూర్లో హత్య రాజకీయాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధం లేకుంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు. మంత్రి అండతోనే కొల్లాపూర్లో హత్యలు జరుగుతున్నాయని, ఆయన అనుచరులే హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. యాదవ, ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల మీద జూపల్లి ప్రత్యేకంగా దాడులకు పురికొల్పుతున్నాడని ఆరోపించారు. శ్రీధర్రెడ్డి హత్య కేసుపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే జూపల్లిని మంత్రివర్గం నుంచి తప్పించాలని పేర్కొన్నారు. జూపల్లి సొంత గ్రామం పెద్దదగడలో ధాన్యం గోడౌన్లో 15 వేల బస్తాలు మాయమయ్యాయని, జూపల్లి మనుషులు దొంగతనాలు చేస్తే కూలీలు, డ్రైవర్లు, సామాన్యులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: గువ్వల
కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఓ న్యాయం.. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓ న్యాయం అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పోటీకి ముందుకు రాకుండా ఉండేందుకే భయభ్రాంతులను గురిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హింసారాజకీయాలకు బీఆర్ఎస్ భయపడబోదని స్పష్టంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అభిలాశ్ రంగినేని, కొమ్ము నరేందర్ పాల్గొన్నారు.