RS Praveen Kumar | హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ): కేసులు సాకుగా చూపుతూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా శిక్షణకు పంపకుండా ప్రభుత్వం కొందరు అభ్యర్థుల పట్ల నిర్దయ చూపుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ప్రభుత్వ అలసత్వంతో సుమారు 1,500 మంది అభ్యర్థులు తీరని అన్యాయానికి గురవుతూ మనోవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. వారి కన్నీళ్లు తుడిచే నాథుడే లేడని శనివారం ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. అభ్యర్థులు తమ స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ అటెస్టేషన్) పత్రంలో వివిధ కేసులు ఉన్నట్టు ధ్రువీకరించారని తెలిపారు. విద్యార్థి దశలో ఉద్యమ కేసులు, కుటుంబ తగాదాలతో కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులే అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.
చాలా కేసుల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులు కోర్టుల్లో నిర్దోషులుగా తేలారని తెలిపారు. స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) అధికారుల తుది పరిశీలనలో కూడా అభ్యర్థులు ఆయా కేసుల పూర్తి వివరాలతోపాటు, కేసుల్లో నిర్దోషిగా తేలిన కోర్టు తీర్పు కాపీలను స్వయంగా స్పెషల్ బ్రాంచి అధికారులకు అందించారని తెలిపారు. అయినా ప్రభుత్వం వీరికి శిక్షణ అవకాశం కల్పించడం లేదని, నిరుద్యోగులపై ఇంత చులకనభావం ఎందుకని ప్రశ్నించారు. కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులు శిక్షణ ఆర్డర్ కాపీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం చుట్టూ గత రెండు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, దీంతో అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వీరి మనోవేదనపై ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి ఎస్బీ పరిశీలనలో నిర్దోషులుగా తేలిన కానిస్టేబుల్ అభ్యర్థులను శిక్షణకు పంపేలా చైర్మన్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఆయన తన ట్వీట్ను సీఎం కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు తెలంగాణ డీజీపీకి చేరేలా ట్యాగ్ చేశారు.