హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే విద్యాశాఖను అవినీతిమయం చేసిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. గురుకులాలకు సరుకులు, వస్తువుల సరఫరా టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపిందని విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడయాతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో గురుకులాలకు స్వర్ణయుగమని అభివర్ణించారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి మూడు నెలల ముందే పారదర్శకంగా టెండర్లు పిలిచి సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. ఇది తాను చెప్పడంలేదని, ప్రస్తుతం పనిచేస్తున్న ఓ అధికారే చెప్పారని వివరించారు. గురుకుల టెండర్ల విషయంలో ప్రస్తుత సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గురుకుల స్కామ్పై విచారణ జరిపి దోషులను జైలుకు పంపుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్నదని ఆర్ఎస్ ప్రవీణకుమార్ విమర్శించారు. సచివాలయంలో ఫైళ్లు సంబంధిత శాఖా మంత్రుల వద్దకు వెళ్లడం లేదని, పైసలు వచ్చే పైళ్లన్నీ స్టార్ హోటళ్లలో అధికారులకు నేరుగా చేరి జీవోలుగా బయటకు వస్తున్నాయని, అన్నింటిపై సీఎం రేవంత్రెడ్డి స్వయంగా సంతకాలు పెడుతూ ఏకపక్షంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. తాము ఆరోపణలు చేస్తే తమను తిట్టడానికి లేదా వివరణ ఇవ్వడానికి మాత్రమే మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్ బయటకు వస్తున్నారని, వారి శాఖలకు సంబంధించిన ఫైళ్లలో వారి సంతకాలు లేకుండానే జీవోలు జారీ అవుతున్నాయని ఆరోపించారు. రేవంత్రెడ్డి వ్యక్తిగత అవసరాలకు, ఆయన వర్గానికి ఎన్ని నిధులు పోతున్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకు గన్నీబ్యాగుల్లో (సంచుల్లో) నిధులు చేరవేస్తున్న రమేశ్ జైన్, నిరంజన్ జైన్, మఫత్లాల్ లాంటి వ్యాపారవేత్తలను నేరుగా రేవంత్రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకొంటే సరిపోతుందని, ప్రస్తుత మంత్రులకు వారికున్న విలువలేదని ఎద్దేవా చేశారు. టెసో ద్వారా నిబంధనలను తుంగలో తొకి రాజేశ్ అగర్వాల్ అనే వ్యక్తికి బట్టల సైప్లె కాంట్రాక్టు ఇచ్చారు. మఫత్లాల్కు, సీఎం ముఖ్య అనుచరుడు వేం నరేందర్రెడ్డికి ఉన్న దందాల సంబంధం ఏంటో బయటపెట్టాలని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి పెద్ద పెద్ద బాకాలు ఊదుతున్నారని, కానీ గురుకుల విద్యార్థులకు సరఫరా చేసే ట్రంక్ బాక్సుల కాంట్రాక్టును నిరంజన్ జైన్ అనే డ్రగ్ సప్లయర్కు కట్టబెట్టారని ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో ఉన్న నిరంజన్ జైన్ లాంటి వ్యక్తులకు కాంట్రాక్టులు ఇస్తే.. రేపు ట్రంక్బాక్సుల పేరుతో హాస్టల్ పిల్లలకు డ్రగ్స్ సైప్లె చేయరనే గ్యారెంటీ ఏమున్నదని ప్రశ్నించారు. తనపై మాట్లాడటానికి మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్కు రేవంత్రెడ్డి స్రిప్టు ఇచ్చి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. తాను చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమా? అని రేవంత్ సరార్కు ప్రవీణ్కుమార్ చాలెంజ్ విసిరారు. జూలై 2వ తేదీ ఉదయం 11 గంటలకు తాను అన్ని ఆధారాలతో సోమాజిగూడ ప్రెస్క్లబ్కు వస్తానని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కూడా చర్చకు రావాలని సవాల్ చేశారు. ఆ రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నా సరే.. దానిన రద్దు చేసుకొని రావాలని డిమాండ్ చేశారు.