హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణాలకు మహర్దశ పట్టింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించటంలో అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు పట్టణాలకు తూతూ మంత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నాయి. కానీ, స్వరాష్ట్రంలో దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్నది. పట్టణ జనాభాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నది. ప్రస్తుతం తెలంగాణ పట్టణ జనాభా 46 శాతం వరకు ఉన్నదని అంచనా. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు గత 8 ఏండ్లుగా పట్టణాలకు పుష్కలంగా నిధులు కేటాయిస్తున్నది. ప్రజలకు అవసరమైన కనీస అవసరాలను తీర్చడానికి ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నది. తాగునీరు, మార్కెట్లు, రోడ్లు, పారిశుద్ధ్యం, వైకుంఠధామాలు, డ్రైనేజీ, వీధి దీపాలు ఇలా అన్నింటిపై దృష్టి పెట్టింది.
మున్ముందు పట్టణ జనాభా విస్తరిస్తుందని అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మున్సిపల్ శాఖ ద్వారా మున్సిపాలిటీలకు రూ.16 వేల కోట్ల నిధులను కేటాయించారు. వీటికి అదనంగా ఇతర శాఖలకు కూడా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారు. ఇక, గతంలో ఎన్నడూ లేనివిధంగా 3,712 పోస్టులను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు కేటాయించారు. ఈ నియామకాల ప్రక్రియ పూర్తయితే మున్సిపాలిటీలకు సిబ్బంది కొరత తీరనున్నది. పారిశుద్ధ్యానికి పెద్దఎత్తున వాహనాలను కొనుగోలు చేసింది. ప్రతి రోజు ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నది. పట్టణాలు పరిశుభ్రంగా, ఆకుపచ్చగా, ఆహ్లాదకరంగా, అందమైన రోడ్లతో స్వాగతం పలుకుతున్నాయి. పన్ను చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలే మారిపోయాయి. సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణం, టాయిలెట్లు, ఎఫ్ఎస్టీపీలు, ఎల్ఈడీ వీధి దీపాలు, మిషన్ భగీరథ నల్లా నీళ్లు, పేదవారికి ఒక్క రూపాయికే కనెక్షన్, ప్రతి వార్డుకో పార్కు ఇలా సకల సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.