హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ కాకుండా మిగతా పట్టణాలలో అభివృద్ధి పనుల కోసం గడిచిన 8 ఏండ్లలో సుమారు 16 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. పురపాలక శాఖ, దాని అనుబంధ విభాగాల ద్వారా ఈ నిధులను ఖర్చు చేసినట్టు తెలిపారు. పట్టణాభివృద్ధి కోసం ఇంత పెద్దఎత్తున నిధులను వెచ్చించిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పట్టణ ప్రగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టరు,్ల నగరపాలక సంస్థలు, మున్సిపల్ కమిషనర్లతో ఒకరోజు వర్షాప్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. చిన్న రాష్ట్రమైనప్పటికీ పట్టణాల అభివృద్ధి కోసం తెలంగాణ భారీగా నిధులను కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. పరిపాలన సంస్కరణలు, నూతన చట్టాలు, నిరంతరం నిధులు వంటి చర్యలను కొనసాగిస్తూనే.. మౌలికవసతుల కల్పన, ప్రగతి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ‘మాపై అత్యంత సులువుగా రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించక తప్పని అనివార్యతలో ఉన్నాయి. కేంద్రం నిర్వహించే సర్వేల్లో ఎంపికవుతున్న ఉత్తమ పంచాయతీలు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలు అన్నీ తెలంగాణవే ఉంటున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన అత్యుత్తమ జిల్లా ర్యాంకులతోనూ ఇదే విషయం మరోసారి నిరూపితమైంది.
గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్లో టాప్ 3 జిల్లాలు తెలంగాణవే’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. పట్టణాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరూ కాదనలేరని.. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ర్టాలను ఒకసారి పరిశీలించి రావాలని సూచించారు. ‘ఇక్కడే ఉండటం వల్ల మార్పు తెలియడం లేదు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సులో ప్రజలను ఇతర రాష్ర్టాలకు తీసుకుపోవాలని మా పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సూచించాను. అప్పుడే తెలంగాణలో జరిగిన మౌలిక వసతుల కల్పన ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారు తెలంగాణలో అడుగుపెట్టగానే వారికి మార్పు అర్థమవుతున్నది’ అని ఆయన పేర్కొన్నారు.
దేశానికి ఆదర్శంగా మన మున్సిపల్ శాఖ
తెలంగాణ పురపాలక శాఖను దేశంలోనే అత్యుత్తమ శాఖగా తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ దిశగా ఉద్యోగులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాము పనిచేస్తున్న సంస్థలో, విభాగంలో ఏదో ఒక మార్పును తీసుకువచ్చామన్న సంతృప్తిని రిటైర్మెంట్ రోజు పొందినప్పుడే జీవితంలో అసలైన విజయం సాధించినట్టు అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా తెలంగాణలో వార్డుకో ఆఫీసర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ పోస్టుల నియామకాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిందని తెలిపారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉన్నట్టు వార్డుకో ఆఫీసర్ ఉంటారని, కౌన్సిలర్, కార్పొరేటర్తో కలిసి ఆయన పనిచేస్తారని చెప్పారు. మున్సిపల్ శాఖలో 3,712 పోస్టులను భర్తీ చేస్తున్నామని, వీటిలో 600కు పైగా పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నామని మంత్రి వివరించారు.
సవాళ్లతో కూడుకున్న శాఖ
పట్టణ జనాభాలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉందని, తమిళనాడు, కేరళ తరువాత రాష్ట్రంలోనే పట్టణజనాభా అత్యధికమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే 5 ఏండ్లలో తెలంగాణ పట్టణ జనాభా గ్రామీణ జనాభా కంటే ఎక్కువ కాబోతున్నదని, ఇది ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఒక సవాల్ అని చెప్పారు. పట్టణాల్లో 2 వేల చదరపు కిలోమీటర్లలో దాదాపు రెండు కోట్ల జనాభా ఉండనున్నదని తెలిపారు.
10-పాయింట్ ఫార్ములా
రాష్ట్రంలో ప్రజలకు కనీస అవసరాలను తీర్చడానికి 10-పాయింట్ ఫార్ములా అమలు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పది అంశాల్లోని టాస్కులన్నింటినీ వచ్చే మార్చికల్లా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మారెట్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్, వైకుంఠధామాల నిర్మాణం, గ్రీన్బడ్జెట్ అమలు, వార్డుకో పార్కు, అధునాతన దోభీఘాట్ల ఏర్పాటు, బయోమైనింగ్, మానవవ్యర్థాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, ప్రతి పట్టణానికి మాస్టర్ప్లాన్ తయారీ, డిజిటల్ డోర్నెంబర్ కేటాయింపు.. వంటి కీలకమైన అంశాలను రోజువారీ ఎజెండాలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా ఆయా అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 141 పురపాలక పట్టణాలు ఉండగా, వాటిలో 42 ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదాను సాధించడం అద్భుతమైన విషయమని, మిగిలిన పట్టణాలు కూడా ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు కోసం కృషి చేయాలని సూచించారు. వ్యర్థాల శుద్ధిలో జీరోవేస్ట్ మేనేజ్మెంట్ను లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
వచ్చే నెల 24న అవార్డుల ప్రదానం
రాష్ట్రంలో పట్టణ ప్రగతి ప్రారంభమైన ఫిబ్రవరి 24న పట్టణాలను ప్రోత్సహించడానికి అవార్డులను ప్రదానం చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పురపాలక పట్టణాలు అనుసరిస్తున్న ఆదర్శ విధానాలు, నూ తన ఆవిష్కరణలు, ఉత్తమ పనితీరు కనబర్చిన మున్సిపాలిటీలకు, అధికారులకు పట్టణప్రగతి దినోత్సవం రోజున వివిధ క్యాటగిరీల వారీగా అవార్డులను ప్రదానం చేస్తామని తెలిపారు.
ఉద్యోగులు, అధికారులకు అభినందనలు
రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు పెద్దఎత్తున అవార్డులు రావడంలో కృషి చేస్తున్న మున్సిపల్ అధికారులు, సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఒక్కరిద్దరు పనిచేస్తే అవార్డులు రావని, కింది నుంచి పైస్థాయి వరకు అందరూ సమిష్టిగా పనిచేశారని ఆయన ప్రశంసించారు. సీడీఎంఏ సత్యనారాయణ మున్సిపల్శాఖకు ఓ అసెట్ అని, ఆయనకు మున్సిపల్ శాఖపై ఉన్న పట్టు అసామాన్యమైనదని కేటీఆర్ కితాబిచ్చారు. సీడీఎంఏ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని, వచ్చే సంవత్సరం మరిన్ని అవార్డులు సాధించాలని అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు మంత్రి సూచించారు. మున్సిపల్, ఇతర శాఖల ద్వారా పట్టణాల్లో చేపడుతున్న పనులను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానం
స్వచ్ఛ సర్వేక్షణ్ కింద వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల విభాగంలో జనాభా ప్రాతిపదికన తెలంగాణలోని ఏడు పట్టణాలను ఎంపిక చేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాగజ్నగర్, వర్ధన్నపేట, కొత్తకోట, గుండ్లపోచంపల్లి, ఆమన్గల్, జనగామ పట్టణాలకు అవార్డులను మంత్రి కేటీఆర్ అందించారు. ఆయా జిల్లా స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ అవార్డులను అందుకున్నారు. ఏడు మున్సిపాలిటీలకు ప్రోత్సాహకంగా ఒక్కోదానికి రూ.2 కోట్లు ప్రభుత్వం అందించనున్నది. గతంలో తెలంగాణకు 19 అవార్డులు రాగా.. వాటిని ఢిల్లీలో కేంద్రమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. తాజాగా ప్రకటించిన అవార్డులను రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసికొని అందించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో స్థానికంగా మంత్రి కేటీఆర్ ఈ అవార్డులను అందించారు.
ఈ కార్యక్రమంలో సీడీఎంఏ సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త మున్సిపల్ చట్టానికి అనుగుణంగా, సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలపై మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో పనిచేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలకు అవసరమైన 3-ఎం (మనీ, మ్యాన్పవర్, మెటీరియల్) అందించారని అన్నారు. మున్సిపల్ శాఖలో 3,712 పోస్టులు మంజూరు అయ్యాయని, ఇప్పటికే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిందని తెలిపారు. పట్టణ ప్రగతి కింద నెలనెలా నిధులు విడుదల చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలపై అదనపు పన్నులేవీ విధించకుండా అధునిక టెక్నాలజీ, సంస్కరణలు అమలు చేయడం ద్వారా పట్టణాల ఆదాయాన్ని దాదాపు రూ.364కోట్లకు పెంచుకోగలిగామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్రెడ్డి, ఆస్కీ ప్రొఫెసర్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.