గద్వల టౌన్: రైల్వే పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. గద్వాల రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును మరచిపోయిన ప్రయాణికులకు తిరిగి అందించారు. దీంతో బాధితులు పోలీసులకు క్షతజ్ఞతలు తెలిపారు. ఆమంగ అనే ప్రయాణికురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి గద్వాలకురైలులో వచ్చింది. వారంతా కలిసి పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు. రైలు ఎక్కే తొందరలో.. ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై ఉన్న బెంచీపై తమ లగేజీలో ఒక బ్యాగ్ను మరచిపోయారు.
గుర్తించిన సిబ్బంది బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో రూ.30 వేల నగదు, పదిన్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను గుర్తించారు. దీంతో ఫోన్ నంబర్ ఆధారంగా బాధితులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు గద్వాలకు చెందిన ఉదయ్కుమార్కు బ్యాగును స్టేషన్ మాస్టర్ సమక్షంలో అప్పగించామని రైల్వే హెడ్కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. అయితే బ్యాగును గుర్తించి, సొమ్మును తిరిగి ఇచ్చేందుకు సహకరించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బందికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.