గోదావరిఖని, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన సర్వేలో తగ్గించి చూపారని మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో శుక్రవారం కోరుకంటి చందర్ అధ్యక్షతన బీసీ కుల సంఘాల రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన సర్వేలో ఐదున్నరశాతం బీసీ జనాభాను తగ్గించి రేవంత్రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహించారు.
కులగణనపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం మళ్లీ సర్వే చేపడుతున్నదని విమర్శించారు. బీసీలకు 42 శాతం విద్య, ఉద్యోగ రాజకీయాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు సబ్సిడీపై బ్యాంకు రుణాలు, ఆదాయపుపన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం నిబంధన ఎత్తివేయాలని బీసీ సంఘాల రౌండ్టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు.