BRS Bhavan | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో గులాబీ ప్రభంజనం సృష్టిస్తున్నది. తమ రాష్ట్రంలోనూ తెలంగాణ మాడల్ను అమలు చేయాలని అక్కడి రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(గురువారం)నాగ్పూర్లో బీఆర్ఎస్పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటున్నది. కేవలం ఐదు నెలల స్వల్ప కాలంలోనే మహారాష్ట్ర రాజకీయాలను, ఏక్నాథ్ షిండే సర్కార్ను బీఆర్ఎస్ కకావికలం చేస్తున్నది. సీఎం కేసీఆర్ నాందేడ్లో నిర్వహించిన చిన్న సమావేశానికే అక్కడి సర్కార్ దిగొచ్చింది. రైతుబంధు తరహాలో రైతులకు సంవత్సరానికి ఎకరాకు రూ.6 వేలు పంటపెట్టుబడి సహాయంగా అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించింది. మహారాష్ట్రలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా విస్తృత నెట్వర్క్ ఉన్న శంభాజీ బ్రిగేడ్తోపాటు ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని షేత్కరీ సంఘటన్లు, పలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్లో విలీనం అయ్యాయి. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన నినాదంతో మహారాష్ట్ర రైతులు, యువకులు, మహిళలు ఆకర్షితులై గులాబీగూటికి చేరువవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు సహా వందలాదిగా సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ శాశ్వత, సొంత కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. నాగ్పూర్లోని గాంధీబాగ్లో విశాలమైన స్థలంలో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్ఎస్భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం పార్టీ కార్యాలయంలో వేదపండితులు సంప్రదాయబద్దంగా పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. గణపతి హోమం, వాస్తు, చండీ హోమాలను నిర్వహించారు.