వేములవాడ, ఫిబ్రవరి 7: ఆన్లైన్ రసీదు చూపితేనే వేములవాడ రాజన్న ఆలయ సముదాయాల్లో భక్తులకు అద్దె గది కేటాయిస్తారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఏ వసతి సముదాయంలో ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి? ఎప్పుడు ఖాళీ అవుతాయో పూర్తి సమాచారం ఆన్లైన్లో ఉంచుతామని ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు.
455 గదులు మాత్రమే అందుబాటులో..
రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నందీశ్వర, లక్ష్మీగణపతి, పార్వతీపురం, భీమేశ్వర సదన్, అమ్మవారి కాంప్లెక్స్ సముదాయాల్లో 455 గదులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అమ్మవారి కాంప్లెక్స్లోని పైఅంతస్తులో వీటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా అక్కడ కేవలం 4 గదులు మాత్రమే భక్తులకు ఇవ్వనున్నారు. పార్వతీపురం వసతి సమ్ముదాయాల్లోనూ పోలీస్, ఇతర కార్యాలయాలకు 18 వసతి గదులు కేటాయించారు. ఇక శంకరపురం, శివపురం ధర్మశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. భక్తులకు విచారణ కార్యాలయం ద్వారానే వసతి గదులు కేటాయిస్తారు. రసీదులో ఖాళీ చేయాల్సిన సమయాన్ని పొందుపరుస్తారు. రూములు కావాల్సిన వారు తప్పనిసరిగా ఎంక్వయిరీ కౌంటర్కు వచ్చి రసీదును చూపాల్సి ఉంటుంది. భీమేశ్వర సదన్, పార్వతీపురం కోసం వచ్చే భక్తులకు విచారణ కార్యాలయం దూరంగా ఉన్నందున ఈ రెండింటికీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు.
టీయాప్ ద్వారా ముందస్తు బుకింగ్
రాజన్న సన్నధికి వచ్చే భక్తులు వసతి గదులను ముందస్తుగా ఆన్లైన్ ద్వారా రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. టీ యాప్ ఫోలియో యాప్, మీసేవ ద్వారా రాజన్న సన్నిధిలో వసతి గది, స్వామి వారి ఆర్జిత సేవలకు సంబంధించిన పూజల టికెట్లను కూడా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే కనీసం నాలుగు రోజుల ముందు బుక్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.