మారుమూల జిల్లాల్లోనూ పెరిగిన కనెక్టివిటీ
సీఆర్డీపీతో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు చెక్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : స్వరాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యాలు విస్తరించాయి. అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడ నుంచి రాష్ట్ర రాజధానికి రహదారుల అనుసంధానం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో మారుమూల ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో రహదారుల సౌకర్యం విస్తృతమైంది. మంత్రి కేటీఆర్ చొరవతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (సీఆర్డీపీ) నిధులతో చేపట్టిన పనులు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను చాలావరకు తీర్చాయి. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లను అభివృద్ధి చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేశారు. పాత రోడ్లకు మరమ్మతులు చేశారు. లింక్ రోడ్లు నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 7,511కిలోమీటర్ల మేర రోడ్లు విస్తరించాయి. ఇందులో పంచాయతీరాజ్ రోడ్లు 5,416.5 కిలోమీటర్లు, రోడ్లు భవనాలశాఖ నిర్మించినవి 1,821.5 కిలోమీటర్లు, జాతీయ రహదారులు 273 కిలోమీటర్లు ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధికభాగం జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటంతో ఆ జిల్లాలో రోడ్ల నిడివి అత్యల్పంగా 938.6 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. ఒక్క పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాతీయరహదారులు ఉండటం విశేషం.