హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): తూర్పు నుంచి వీస్తున్న గాలులకు క్యుములోనింబస్ మేఘాలు తోడవడంతో శుక్రవారం రాత్రి గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో వేడెక్కిన నగరంపై రాత్రి వాన దంచికొట్టింది. టీఎస్డీపీఎస్ అధికారుల సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు సరూర్నగర్ మండలంలోని లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సైదాబాద్లోని కుర్మగూడలో 10 సెం.మీ., హయత్నగర్లోని హస్తినపురంలో 8.83 సెం.మీ., అస్మాన్ఘడ్లో 8.7 సెం.మీ., చార్మినార్లోని సర్దార్మహల్లో 8.6 సెం.మీ., రాజేంద్రనగర్లో 6.9 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు, చింతలకుంటలో జగదీష్ అనే వ్యక్తి బైక్తో సహా హైవే పక్కనున్న కల్వర్టులో పడి వరదనీటిలో కొట్టుకు పోయాడు. కొద్దిదూరం వెళ్లాక వరద తగ్గి ప్రాణాలతో బయటపడ్డాడు.