హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖను పునర్వ్యవస్థీకరిస్తూ మంగళవారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా మూడు చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు, 10 సర్కిళ్లు, 13 డివిజన్లు, 79 సబ్ డివిజన్లు, 124 సెక్షన్లను ఏర్పాటుచేసింది. ఒక సర్కిల్, మూడు డివిజన్లు, 15 సబ్ డివిజన్లు, 96 సెక్షన్ కార్యాలయాలకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాస్రాజు మంగళవారం ఉత్తర్వు లు జారీచేశారు. కొత్తగా ఏర్పాటుచేసిన కార్యాలయాల్లో అధికారులను నియమిస్తారు. దీని ప్రకారం కొత్తగా మూడు చీఫ్ ఇంజినీర్ పోస్టులు, 10 సర్కిళ్లకు సూపరింటెండెంట్ పోస్టులు, 13 డివిజన్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 79 సబ్ డివిజన్లకు డిప్యూటీ ఇంజినీర్లు, 124 సెక్షన్లకు జూనియర్ ఇంజినీర్ పోస్టులు మంజూరయ్యా యి.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం పెరిగిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, భవనాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అండ్ బీ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాలకు తోడు వ్యవసాయ రంగం అభివృద్ధితో జిల్లాలు, గ్రామీ ణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీంతో కొత్త రోడ్ల ఏర్పాటు, రోడ్ల విస్తరణ, రోడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టేందుకు ఆర్అండ్బీ శాఖను పునర్వ్యవస్థీకరించాల్సిన అనివార్యత ఏర్పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారులతో పలుదఫాలు చర్చించి రోడ్లు, భవనాలు, రహదారులు, పరిపాలన, నాణ్యతా నియంత్రణ తదితర విభాగాల పునర్వ్యవస్థీకరణపై వారినుంచి ప్రతిపాదనలు స్వీకరించి ఈ మేరకు కొత్త పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కొత్త సర్కిళ్లు, డివిజన్లకు సంబంధించిన సరిహద్దులను త్వరలో ఖరారు చేయనున్నారు.