రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి వద్ద అర్ధరాత్రి దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై దొంగలు తల్వార్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. రక్త మైసమ్మ దేవాలయం సమీపంలో దారికాచిన దోపిడీ దొంగలు అటకాయించి ద్విచక్రవాహనంపై ఉన్న కిశోర్ కుమార్ రెడ్డి, తులసి అనే ఇద్దరిపై తల్వార్ల తో దాడి చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడ్డ కిశోర్ కుమార్ రెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందాడు. దొంగల బారి నుంచి తప్పించుకున్న తులసి దాడిలో చేయి నాలుగు వేళ్లు కోల్పోయింది . తులసి వద్ద ఉన్న రూ. 15 వేలు దొంగిలించిన ముఠా సభ్యుల నుంచి ఆమె తప్పించుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.