జడ్చర్ల: జడ్చర్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్చ పట్టణానికి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరి పొట్టు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో ఆ మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఒకవైపు లారీని రోడ్డుపై నుంచి తొలగించే ఏర్పాట్లు చేస్తూనే, మరోవైపు ట్రాఫిక్ను వన్వేలోకి మళ్లించారు.
దాంతో వన్వేలో నాలుగు వాహనాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.