హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని నదులు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. విచ్చలవిడిగా వ్యర్థాలు, కలుషితాలతో నిండిపోయాయి. పర్యావరణానికి తీరని నష్టం చేస్తున్నాయి. ఈ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోక్సభలో వెల్లడించింది. తెలంగాణ ప్రాంతంలోని నదుల్లో పరిమిత స్థాయిలోనే కలుషితాలు ఉన్నట్టు తెలిపింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘నేషనల్ వాటర్ క్వాలిటీ ప్రోగ్రాం’ కింద దేశవ్యాప్తంగా ఉన్న 279 నదుల్లో మహానగరాలు, పారిశ్రామికవాడలకు ఆనుకొని ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. శాంపిళ్లను సేకరించి అందులో ‘బయో-కెమికల్ ఆక్సిజన్ డిమాండ్’ (బీవోడీ) ఎంత పరిమాణంలో ఉన్నదో విశ్లేషించింది. ఒక లీటర్ నీటిలో ఒక మిల్లీగ్రామ్ బీవోడీ ఉన్నా.. నీటిలోకి కాలుష్యాలు చేరినట్టు నిర్ధారిస్తారు. ఎంత ఎక్కువగా బీవోడీ స్కోర్ ఉంటే కాలుష్యం ఆ స్థాయిలో ఉన్నట్టు లెక్క.
గుజరాత్లో ఆరు నదులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్టు కేంద్రం పేర్కొన్నది. సబర్మతి నదిని బీజేపీ ప్రభుత్వం కాలుష్య కాసారంగా మార్చేసింది. ఆ నదిలో బీవోడీ స్థాయి ఏకంగా 292గా నమోదైంది. దీంతోపాటు భదర్, ఆమ్లఖడి, ధాదర్, ఖారి, విశ్వామిత్రి నదులు మొదటి గ్రేడ్లో ఉన్నాయి. అంటే సగం నదులు కాలుష్యాలతో నిండిపోయాయి.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ నదులు కలుషితాలతో నిండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో భేలా నదిలో బీవోడీ 287గా నమోదైంది. రాష్ట్రంలో 16 నదులు ఉండగా ఆరు మొదటి క్యాటగిరీలోనే ఉన్నాయి.
కేంద్రం, ఆయా రాష్ర్టాల బీజేపీ ప్రభుత్వాలు మురుగునీటి శుద్ధిపై నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల కోట్లను గుజరాత్కు తరలిస్తున్న ప్రధాని మోదీకి అక్కడి నదుల కాలుష్యం ఎందుకు పట్టడం లేదని నిలదీస్తున్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభు త్వం వ్యర్థజలాల విడుదలపై కఠినంగా వ్యవహరిస్తున్నదని. పరిశ్రమలు కచ్చితంగా ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తున్నదని వారు తెలిపారు. తెలంగాణ సర్కారు ఇండ్ల నుంచి వచ్చే మురుగును ఎక్కడికక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేస్తున్నది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 20 పెద్ద దవాఖానల్లోనూ ఎస్టీపీ ప్లాంట్లు నిర్మిస్తున్నది.
తెలంగాణలోని నదుల్లో పరిమిత స్థాయిలోనే కలుషితాలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఒక్క మూసీ నదిలో బాపూఘాట్ నుంచి రుద్రవెల్లి, కసనిగూడ నుంచి వలిగొండ వరకు కలుషితాలు ఎక్కువ ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది. మొదటి క్యాటగిరీలో ఉంచింది. అయితే ఈ ప్రాంతంలో బీవోడీ 66 మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నది. మిగతా నదులన్నింటిలో పెద్దగా కలుషితాలు లేవని పేర్కొన్నది.