నిజామాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్ట్ల్లోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. కాగా, జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. నాలుగైదు రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతున్నది. గురువారం సాయంత్రానికి కందకుర్తి వద్ద భారీగా గోదావరి నదిలో వరద దిగువకు ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది.
గోదావరిలో వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరి ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తున్నది. భారీ వర్షాలతో నదిలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరగా.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో వర్షానికి సీతారామస్వామి ఆలయ పరిసరాల్లోకి వర్షం నీరు చేరింది. దీంతో భక్తులు ఇబ్బందులుపడుతున్నారు. మరో వైపు అన్నదాన సత్రం వద్దకు నీరు చేరింది. దీంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.