హైదరాబాద్, సెప్టెంబర్23 (నమస్తే తెలంగాణ): ఏడేండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ రాష్ట్రం భూమి పైన, భూగర్భంలోనూ జల నిధులతో కళకళలాడుతున్నదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాల వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. మొత్తంగా 680 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. 2022 సంవత్సరానికి సంబంధించి ‘తెలంగాణ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కంప్యూటెడ్’ నివేదికను బీఆర్కే భవన్లో ఆయన శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడేండ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 4.26 మీటర్లకు పైగా పెరిగిందని తెలిపారు. భూగర్భ జలాలు అత్యధికంగా 83శాతం మండలాల్లో పెరిగాయని వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత 680టీఎంసీలకు చేరుకున్నదని తెలిపారు. అదేవిధంగా 2020తో పోల్చితే రాష్ట్రంలో భూగర్భ జలాల వినియోగం 8 శాతానికి తగ్గిందని చెప్పారు. తెలంగాణ రా్రష్ట్ర ఏర్పాటు నాటికి 3.5శాతం భూగర్భ జల వనరులు ఉండగా, అది 2022లో 4.8 శాతానికి పెరిగిందని తెలిపారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పెద్ద, మధ్య తరహా ప్రాజెక్టుల అనుసంధా నం ద్వారా, చెరువులను నింపడం, చెక్ డ్యా మ్ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. రాష్ట్రంలోని విలువైన భూగర్భ జల వనరులను తెలంగాణ రైతుల సంక్షేమం, శ్రేయస్సు కో సం కచ్చితంగా ఉపయోగించాలని సూచించారు. ఆ దిశగా నిర్దిష్ట చర్యలను సిఫారసు చేసేందుకు భూగర్భ జలా లు, పరిశ్రమలు, వ్యవసాయం, పంచాయితీ రాజ్శాఖల అధికారులతో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, భూగర్భ జలవనరుల విభాగం డైరెక్టర్ పండి త్ మడ్నూరే తదితరులు పాల్గొన్నారు.