హైదరాబాద్ : ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని అమ్ముకున్న రైసు మిల్లర్ల (Rice Millers )పై క్రిమినల్ కేసు(Criminal Cases) నమోదు చేయాలని పౌరసరఫరాల సంస్థ(Civil Supplies Corporation) చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు.సీఎంఆర్లో జరుగుతున్న జాప్యంపై శుక్రవారం పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్ల నుంచి (కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సీఎంఆర్(CMR) సేకరణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి యుద్దప్రతిపాదికన భారత ఆహార సంస్థకు (FCI) బియ్యాన్ని అప్పగించేందుకు 25 మంది పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ( Vigilence and Enforcement), పౌరసరఫరాల సంస్థ (Civil Supply) ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్లుల్లో ప్రత్యేక తనిఖీలు ( Special inspections )నిర్వహిస్తాయని అన్నారు.
ముందుగా సీఎంఆర్ పెండింగ్ లో ఉన్న జిల్లాల నుంచి తనిఖీలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం రైసు మిల్లుల్లో ఉందా? లేదా? గడువు ప్రకారం సీఎంఆర్ అప్పగించారా? పెండింగ్ ఉన్న సీఎంఆర్ ఎంత? వంటి అంశాలతో పాటు, కరెంట్ బిల్లులు, ఎ,బి రిజిస్టర్లను తనిఖీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ కోసం అవసరమైన బియ్యాన్ని మిల్లర్ల నుంచి సంస్థ ఇప్పటికే సేకరించిందని , ఇకపై ప్రతి బియ్యం గింజను భారత ఆహార సంస్థకు అప్పగించవలసిందేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ పౌరసరఫరాల సంస్థ తీసుకోబోదని స్పష్టం చేశారు.
సీఎంఆర్ ఇవ్వకపోతే 25శాతం జరిమాన..
ప్రత్యేక బృందాలకు ఆయా జిల్లాల అధికారులు సహకరించాలని, ఏ మాత్రం సహాయనిరాకరణ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశించిన గడువులోగా ఎఫ్సీఐకి సీఎంఆర్ ఇవ్వకపోతే ఆ బియ్యానికి బదులుగా 25శాతం జరిమానాతో నగదు రూపంలో వసూలు చేస్తామే తప్ప బియ్యాన్ని మాత్రం తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మిల్లర్లకు కూడా తెలియజేయాలన్నారు. 2019-20కి సంబంధించిన 118 మంది మిల్లర్లపై విధించిన 25 శాతం జరిమానాను కూడా వసూలు చేయాలని ఆదేశించారు. మార్చి 25వ తేదీలోగా ఆయా జిల్లా అధికారులు ఎఫ్సీఐకి బిల్స్ సబ్మిట్ చేయాలని అన్నారు.