హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో వరి ధాన్యం విస్తారంగా సాగైంది. ఎక్కడ చూసినా వరి నాట్లతో భూమికి పచ్చని చీర చుట్టేసినట్టు కనిపిస్తున్నది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ వానకాలం సీజన్లో ఇప్పటివరకు 61.75 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఈ స్థాయిలో వరి సాగు కాలేదని, ఇది ఆల్టైం రికార్డు అని అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది కన్నా ఈ వానకాలంలో 9.85 లక్షల ఎకరాల్లో అధికంగా వరి నాట్లు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 51.90 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఏడాది వేసిన నాట్లలో 52 శాతం సన్నాలు కాగా, 48 శాతం దొడ్డు ధాన్యం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 1.50 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. ధాన్యం దిగుబడిలోనూ ఇది చరిత్ర కాగలదని అంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరం (2014-15) వానకాలంలో 22.74 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు వరి సాగుచేశారు. ఈ ఏడేండ్లలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కారణంగా విస్తారంగా సాగునీటి వనరులు అందుబాటులోకి రావడంతో వరి సాగు 39 లక్షల ఎకరాలు పెరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వ్యవసాయ రంగాన్ని పండుగ చేయాలనే సీఎం కేసీఆర్ తపనలో నుంచి ఈ విజయం సాధ్యమైంది. వ్యవసాయ రంగానికి సాగునీటి గోసను తీర్చిన సీఎం కేసీఆర్.. సాగులో రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపారు. ధాన్యం కొనుగోళ్లలో గతేడాది దేశంలోనే తెలంగాణ రికార్డులు సృష్టించింది. రెండు సీజన్లలో కలిపి భారత ఆహార సంస్థ తెలంగాణ నుంచి ఏకంగా 1.41 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ వానకాలంలో అన్ని పంటల సాగులోనూ దూకుడు కనిపిస్తున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా వరి సాగు 61.75 లక్షల ఎకరాల్లో, ఆ తర్వాత పత్తి 46.25 లక్షల ఎకరాల్లో సాగైనట్టు తెలిపింది. కంది పంట 7.59 లక్షల ఎకరాలు, మక్కజొన్న 7.04 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.73 లక్షల ఎకరాలు, పెసర 88వేల ఎకరాల్లో సాగైంది. గత వానకాలం సీజన్తో పోల్చితే ఈ సీజన్లో కాస్త తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. గతేడాది వానాకాలంలో ఈ సమయం వరకు 1.33 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతంతో పోల్చితే సుమారు 4.17 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. గతేడాది సీజన్ ఆరంభంలోనే విస్తారమైన వర్షాలు కురిశాయి. దీంతో రైతులు ఎక్కువ పంటలు సాగు చేయగలిగారు. కానీ ఈసారి వర్షాలు కాస్త ఆలస్యంగా రావడం పంటల సాగుపై ప్రభావం చూపింది.