‘నేను ఓటేసినోడెవ్వడూ చేనుకు నీరియ్యలే. వాన పడితే పండినట్టు. పడకపోతే అప్పు పెరిగినట్టు’ అని బొల్లం సత్తెయ్య చెప్తున్న బాధలు, సంతోషాలు తానొక్కడివి కావు. ఊరందరివి. ఎన్ని కాలాలు చూసిండో? ఎట్ల బతికిండో చెప్తున్నడు మునుగోడు చెరువు కింద పత్తి, వరి సాగు జేస్తున్న ఉండోరిగూడెం (మునుగోడు మండలం) రైతు బొల్లం సత్తెయ్య! ఈసారి కారుకే నా ఓటంటున్న మనకాలపు సత్తెయ్య ఆ ఓటెందుకేస్తనంటున్నడో? రాజగోపాల్ను ఎందుకు కాదంటున్నడో జెప్పిన ముచ్చట ఇది!
సారొచ్చినంక చెరువు బాగైంది. బాయిలు ఉబ్బనయ్. ఏ బాయిల జూసినా ఆరేడు గోలాల లోతు నీళ్లున్నయ్. బోర్లు నిండుగ పోస్తున్నయ్. పెట్టుబడికి రైతుబంధు సాయం.. ఫ్రీ కరెంటు.. ఇంకేం గావాలె. చెర్లన్నీ నిండి చేలన్నీ పచ్చబడ్డయ్. ఊళ్లన్నీ బాగుపడ్డయ్. అప్పులు తీర్చే రోజులొచ్చినయ్. కేసీఆర్ రైతుకు మేలు జేసిండు కాబట్టి ఈసారి కారు గుర్తుకే ఓటేస్త. కేసీఆర్కు ఓటెయ్యకపోతే తప్పయితది.
మునుగోడు నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేకప్రతినిధి: మా మునుగోడు దిక్కు పల్లెల్ల నీళ్లు కనవడితే కండ్లకు పండుగే. అట్లుండేది అప్పటి కాలం. వానకాలం దాటిపోతే భూములన్నీ బీళ్ల తీరుగ ఉండేది. కాలంగాని రోజుల్లో ఎన్ని బాధలువడ్డమో?! కాలంగానప్పుడు అప్పుల తిప్పలుండేది. కాలమైతే వచ్చిన లాభం అప్పులకే పోయేది. ఈ రైతు బతుకు కంటే కూలి బతుకే బాగుంటదని భూములు వదిలి పట్నం పోయి బతికినోళ్లూ ఉన్నరు. బాయి తీసి డీజిల్ ఇంజిన్పెట్టి ఎవుసం నడిపినం. పండిన పంటకు డీజిల్ ఖర్చు గూడ రాకపోయేది. కాలంగాక మా నాయిన ఆరు ఎకరాల భూమి అమ్మిండు.
కేసీఆర్ వచ్చినంక.. చెరువులను బాగుజేసుడు మొదలువెట్టిండు. వాగులల్ల కల్లెడ తీయించిండు. చెరువుకట్ట మంచిగ చేయించిండు. మునుగోడు వాగుకు కత్వ కట్టించిండు. కల్లెడ తీయించిండు. చెరువులకు నీళ్లను తెప్పించిండు. ఇట్ల జెయ్యబట్టే చెరువు నిండింది. లేకుంటె చెరువు నిండునా?
పోయిన ఏడు వానలకు చెరవులు పొంగినయ్. మునుగోడు చెరువు మూడు నెలలు అలుగు పోసింది. జాలుపారి నా పత్తి చేనంతా ఆగమైంది. అయినా నాకు బాధలేకుండె. నీళ్లొచ్చినయ్. ఊరు బాగుపడుతదనుకున్న. పండనీ పండకపోనీ కౌలు కట్టాలని భూస్వామి అంటే కట్టిన. పదిహేను ఏండ్ల కింద పొంగిన మునుగోడు చెరువు.. మల్లా నిరుడు పొంగింది. బాయిలల్లకు మల్లా నీళ్లొచ్చినయ్. ఒక్కో బాయిల ఇప్పుడు ఆరు ఏడు కోలల లోతల నీళ్లున్నయ్. మా బావి ఎండిపోయి 18 ఏండ్లయ్యింది. ఇన్నేండ్లకు నీళ్లొచ్చినయ్. ఇప్పుడు ఏడ జూడు నీళ్లు! ఇంగ బోర్ల గురించి చెప్పేదేముంది? నిండుగ పోస్తున్నయ్. ఈడ ఒకప్పుడు వరి పండలే. రెండేండ్ల నుంచి వడ్లు పండుతున్నయి. ఈ ఏడు వానలు బాగా పడలేదు. కానీ, నిరుడు బాగా పడినయ్. అందుకనే ఇప్పుడు బోర్లు నిండుగ పోస్తున్నయ్. ఈ ఏడంతా ఇబ్బంది రాదు. మునుగోడు చెరువు బాగైంది. మల్లా భూములు పచ్చబడ్డయ్. ఊళ్లు బాగుపడ్డయ్.
ఈ ఏడు వరి, పత్తి పెట్టిన. సొంతం 8 ఎకరాలు ఉన్నది. ఇంకో 10 ఎకరాలు కౌలుకు చేస్తున్న. ఒకప్పుడు డీజిల్ ఖర్చులకు అప్పులు పెరిగినయ్. చిన్నచిన్న అప్పులే. కానీ, ఏటా అయిన అప్పులన్నీ కలిసి పెద్దగైనయ్. రూ.8 లక్షల అప్పు జేసిన. మూడేండ్ల నుంచి చెరువు నిండి, పంట పండింది. కాబట్టి అప్పులు అయితలేవు. రెండేండ్ల నుంచి దిగుబడి పెరిగింది. ఆదాయం గూడ పెరిగింది. ఈ రెండేండ్లల్ల రూ.5 లక్షలు అప్పు తీర్చిన.
ఎవనికి మేలు ఎటు దిక్కున ఉంటే అటు నిలబడాలే. అదే రాజకీయమంటే. నాకు కేసీఆర్ మేలు జేసిండు. కాబట్టి కారుకే ఓటేస్తం. రాజగోపాల్కు, వాళ్లన్నకు ఎన్నిసార్లు ఓట్లేసినం. నీళ్లు తెచ్చిన్రా. మేలు చేసిన్రా? వాళ్లే బాగుపడ్డరు. రాజగోపాల్ పువ్వు గుర్తుకు వేయమని అడుగుతున్నడు. ఇప్పటికేసింది జాలు. ఆయనకు ఎటు మేలుంటే అటు మారిండు. మా లాభం చూసుకోని మేం మారినం. కేసీఆర్ చెరువులకు మంచి జేసిండు. కాబట్టే ఇప్పుడు రైతు ఇట్ల ఉన్నడు. రైతుబంధు, రైతుబీమా ఇచ్చిండు. ఇంకతంటే రైతుకు ఏం గావాలే? ఈ ఒక్కపాలి కారు గుర్తుకేస్త. కేసీఆర్కు ఓటెయ్యకపోతే తప్పయితది.
ఒకప్పుడు వానకాలం అయిపోయిన నెలకే సుక్క నీరు ఉండకపోవు. అసొంటిది ఎండకాలం వచ్చినా చెరువులు ఎండుతలేవంటే ఉత్తగనే అయిందా? ఆ కేసీఆర్ పుణ్యాన చెరువులు బాగుపడ్డయ్. మునుగోడు చెరువుకే గాదు అన్ని చెర్లను ఇట్లనే జేసిండు. ఊళ్లన్నీ ఈ తీర్గనే పచ్చబడ్డయ్. ఏ ఊరికి పోయినా వరే! ఒకప్పుడు బాయిలెండిపోయి పత్తులొచ్చినయ్. మల్లా బాయిలన్నీ ఉబ్బినయ్. బోర్లు పోస్తున్నయ్. మిషన్ కాకతీయ పనులు చేయబట్టే ఒక చెరువు అలుగు పోసినంక ఇంకో చెరువు నిండబట్టె. ద్వానపెల్లి, ఉడపూర్, చెన్నుగూడ చెరువులు నిండుతున్నయ్. పులిపలుపుల, కల్లపెల్లి చెరువుల్లో కూడా ఇట్ల చేయబట్టే నీరు నిలవడ్డది. పత్తి తగ్గి వరి పెరిగింది.