వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 10: తెలంగాణలో రూపొందించిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతి బద్రీ తెలిపారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అవిరళ కృషితో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఇటీవల విడుదల చేసిన వరి వంగడాలతో అనేక రాష్ర్టాల్లో మంచి దిగుబడులు వచ్చాయని తెలిపారు. నేల ఉపరితల ఉష్ణోగ్రత, క్షీణిస్తున్న నేల సారం, అధిక మోతాదులో ఎరువుల వినియోగం తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఐఐఆర్ఆర్ క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేపట్టిందని తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకుంటూ, నేల సారం క్షీణిస్తున్న పరిస్థితుల్లో తక్కువ మోతాదులో ఎరువులను ఉపయోగించి, అధిక దిగుబడులను ఇచ్చే వరి వంగడాలను రూపొందించామని చెప్పారు. డీఆర్ఆర్ ధాన్ 47, 48, 49, 52, 54, 55, 57, 60, 63, 65, 66 రకాల వంగడాలను సాగు చేసి రైతులు అధిక దిగుబడులు పొందుతున్నారని వెల్లడించారు. డీఆర్ఆర్ ధాన్ 48 సన్నరకంలో చక్కెర శాతం తక్కువగా ఉన్నందున ఈ ఏడాది దేశవ్యాప్తంగా లక్ష హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో సాగవుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, కేరళ, హర్యానా, ఒడిశా, తెలంగాణ వరి వంగడాలపై ఆసక్తి చూపుతున్నారని వివరించారు.