ఎర్రుపాలెం, మే 11: తన భూమిలోని టేకుచెట్ల నరికివేతకు అనుమతి కోరిన ఓ రైతును లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ, సర్వేయర్ను ఏసీబీ అదుపులోకి తీసుకొన్నది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని అయ్యవారిగూడేనికి చెందిన రైతు మోరబోతుల రామకృష్ణ మూడు ఎకరాల్లో 720 టేకు చెట్లను పెంచాడు. వాటి నరికివేతకు అనుమతి ఇవ్వాలని మార్చి 10న తాసిల్దారుకు దరఖాస్తు చేసుకొన్నాడు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని ఆర్ఐ యాకుబ్పాషా, సర్వేయర్ కొంపల్లి శేషయ్యను తాసిల్దారు ఆదేశించారు.
అనుమతి ఇవ్వాలంటే రూ.35 వేలు లంచం ఇవ్వాలని ఆర్ఐ రైతును డిమాండ్చేశాడు. చివరకు రూ.7 వేలకు ఒప్పుకొన్నాడు. సర్వేయర్ శేషయ్య రూ.10 వేలు లంచం అడగగా రూ.3 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆర్ఐ, సర్వేయర్లు రైతుతో మాట్లాడిన రికార్డులను గత నెల 21న హైదరాబాద్లోని ఏసీబీ కోర్టు పరిశీలించింది. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఆర్ఐ యాకుబ్పాషా, సర్వేయర్ శేషయ్యను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలోని ఆర్ఐ స్వగృహం, తల్లాడలోని సర్వేయర్ స్వగృహంలో సోదాలు నిర్వహించారు. నిందితులను గురువారం రిమాండ్కు పంపిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.