పెద్దపల్లి, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్సీఎల్)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ.6,338 కోట్ల నిధులతో పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ను శనివారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ.. రిమోట్ ద్వారా ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారు.
దీంతోపాటు భద్రచాలం రోడ్డు నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వేలైన్ను సైతం జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్ల నిధులతో నిర్మించనున్న మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచ-మహదేవపూర్ జాతీయ రహదారుల విస్తరణ పనులకు సైతం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3:27 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియానికి చేరుకున్న ప్రధాని మోదీ సాయంత్రం 4:55 గంటలకు అక్కడి నుంచి నిష్క్రమించారు.